మధ్యాహ్నం బాలకృష్ణ.. రాత్రికి రామకృష్ణ.. చుక్కలు చూపిస్తోన్న వైసీపీ
సేవ్ అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటోన్న ప్రతిపక్ష టీడీపీకి అధికార వైసీపీ గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళనల్ని ముమ్మరం చేసింది. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తోన్న ఎమ్మెల్యేలు, కీలక నేతల్ని.. మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ స్థానిక వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వరుస సంఘటనల్లో గురువారం మధ్యాహ్నం హిందూపూర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణకు, రాత్రి వైజాగ్ లో మరో ఎమ్మెల్యే రామకృష్ణబాబుకు వ్యతిరేకంగా అధికార పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.
కాగడాలతో వచ్చి..
విశాఖపట్నంలోనే రాజధాని ఏర్పాటుకు మద్దతివ్వాలంటూ అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు గురువారం రాత్రి వైజాగ్ లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాగడాలు, జెండాలు, ఫ్లకార్డులతో వచ్చి ఆఫీసు ముందు బైఠాయించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు, టీడీపీ అధినేత చంద్రబాబుల దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
వైజాగ్ లో టెన్షన్..
ఆఫీసు వద్ద వైసీపీ కార్యాకర్తలు ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు అక్కడికి పరుగున వచ్చారు. రెండు వైపులా భారీ సంఖ్యలో కార్యకర్తలు మోహరించి, వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ, టీడీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఉద్రిక్తతను తగ్గిస్తూ పోలీసులు రెండు వర్గాలను చెల్లాచెదురుచేశారు. ఈ సంఘటన తర్వాత వైజాగ్ లో ఒకింత టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అంతకుముందు బాలకృష్ణ..
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపూర్ లోనే వైసీపీ నేతలు అడ్డుకోవడం, ‘‘సీమద్రోహి బాలయ్య గోబ్యాక్'' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు అడ్డుకోవద్దని, రాయలసీమకు అన్యాయం చేయొద్దని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఒకదశలో వైసీపీ కార్యకర్తలు బాలయ్య కాన్వాయ్ పైకి దూసుకురాగా పోలీసులు అడ్డుకుని పంపించారు.