'వైఎస్సార్ విగ్రహాలపై దాడుల వెనుక పరిటాల సునీత.. పోలీసులకు పట్టదా?'
మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్సార్ విగ్రహాలపై దాడులకు పాల్పడుతున్నారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: జిల్లాలో వైఎస్సార్ విగ్రహాల కూల్చివేతపై వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. దీని వెనకాల అధికార పార్టీ కుట్ర ఉందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా అనంతపురం వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు.
జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్సార్ విగ్రహాలపై దాడులకు పాల్పడుతున్నారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అలసత్వ వైఖరి వల్లే రాప్తాడులో ఇప్పటివరకు ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలు దాడులకు గురయ్యాయని తెలిపారు.
జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాప్తాడులో టీడీపీ నేతల దౌర్జన్యం కొనసాగుతోందని అన్నారు. ఇదిలా ఉంటే, జిల్లాలో వైసీపీ నేతల హత్యలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటిదాకా జిల్లాలో ఎనిమిది వైసీపీ నేతలు హత్యకు గురయ్యారని, ఇదంతా అధికార పార్టీ కుట్రేనని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
ఒక్క అనంతపురం మాత్రమే గాక రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, విజయనగరం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోను వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.