టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడి
తిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు. మారణాయుధాలతో దాడులు చేసుకుంటున్నారు. చివరికి- ఆసుపత్రి పాలవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసి, ఆయన కారు అద్దాలను పగులగొట్టిన ఘటన విస్మరించకముందే.. మరో దాడి ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.
జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు పరస్పరం వాగ్వివాదానికి దిగారు. అది కాస్త తీవ్రం కావడంతో దాడలు చేసుకున్నారు. పరస్పరం గాయపరచుకున్నారు. ఈ దాడిలో ఆరుమంది టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులిపర్తి నాని పరామర్శించారు.
చంద్రగిరి నియోజకవర్గం పరిధలోకి వచ్చే కొత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కొత్తూరులో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో టీడీపీకి చెందిన కొందరు పార్టీ కార్యకర్తలు కొత్తూరు వినాయకనగర్లో ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య మొదలైన వాగ్యుద్ధం చిలికి చిలికి గాలీవానగా మారింది. మొదట టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు చెబుతుండగా.. దాన్ని వారు తోసిపుచ్చుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారని టీడీపీ కార్యకర్తలు ప్రత్యారోపణ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరినొకరు కొట్టుకున్నారు. భౌతక దాడులకు దిగారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన హర్షవర్థన్, చందూ, మునిశేఖర్, శివయ్య నాయుడు, చంద్ర, చక్రపాణి గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను పులిపర్తి నాని పరామర్శించారు.
టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి కారు అద్దాలు ధ్వంసం..
అంతకుముందు- పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్ సభ పరిధిలో ఇదే తరహా దాడుల ఉదంతం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న నర్సాపురం వైఎస్ఆర్సీపీ లోక్ సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కారుపై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొంతమంది యువకులు దాడి చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రఘురామ కృష్ణంరాజు తన కారును పార్క్ చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అద్దాలను పగులగొట్టారు.