సాక్షి ప్రతినిధులపై జలీల్ ఖాన్ ఆగ్రహం, వైసిపి నేతలపై పిడిగుద్దులు!
విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షి మీడియా ప్రతినిధి పైన దాడి చేశారని, అతనిని వెంటనే అరెస్టు చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసిపి నేత పార్థసారథి విజయవాడలో మాట్లాడారు.
తమ పార్టీకి చెందిన నేతలు విప్ అందించేందుకు వెళ్తే ఎవరు పంపించారు నిన్ను అంటూ భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఇది అమానుషం అన్నారు. ఇది ఖండించదగ్గ విషయమని చెప్పారు. జలీల్ ఖాన్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశామని, అరెస్టు చేయాలన్నారు.
విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి పత్రిక ఫోటో జర్నలిస్టు, వీడియో జర్నలిస్టు పైన జలీల్ ఖాన్ దాడి చేశారని, అతని పైన చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు తహసీల్దారుకు మెమోరాండం ఇచ్చారు.
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి టికెట్ పైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలీల్ ఖాన్ ఆదివారం నాడు ఆ పార్టీ నేతలను దాడి చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్టీ విప్ను అందించేందుకు పార్టీ విద్యార్థి విభాగం విజయవాడ నగర అధ్యక్షుడు అంజిరెడ్డితో పాటు మరో నలుగురు నేతలు జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లారు. సమాచారం అందుకున్న సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం, సాక్షి ఛానెల్ కెమెరామెన్ సంతోష్ వ్యాస్ కూడా అక్కడికి వెళ్లారు.
వైసీపీ నేతలు జలీల్ ఖాన్కు విప్ అందజేస్తుండగా, సదరు దృశ్యాన్ని చిత్రీకరించేందుకు యత్నించిన ఫొటోగ్రాఫర్, కెమెరామెన్లపై జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా జలీల్ ఖాన్ అనుచరులు వారిద్దరినీ కింద పడేసి కాళ్లతో తన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాగే అడ్డొచ్చిన వైసిపి నేతల పైనా దాడి చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెక్క కుర్చీలు, ఫర్నీచర్ ముక్కలతో దాడి చేశారని తెలుస్తోంది. అనంతరం వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జలీల్ ఖాన్, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు.