అధికారం జగన్ ది..పెత్తనం చంద్రబాబుదేనా...! వైసీపీ ప్రభుత్వానికి వరుస షాక్ లు: జాతీయ స్థాయిలోనూ.!
అమరావతి: ఏపీలో అధికారం దక్కిందనే సంతోషం వైసీపీకి లేకుండా పోతోంది. 151 సీట్లు గెలిచినా..పాలనలో తమ మాట నెగ్గించుకోవటం కష్టంగా మారుతోంది. ముఖ్యమంత్రి నేనా..ఎన్నికల కమిషనరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీని భారీ దెబ్బ తీసి..అధికారంలోకి వచ్చినా...చంద్రబాబును పదవీచ్యుతిడిని చేసినా..ఇంకా టీడీపీ అధినేతే అధికారంలో ఉన్నారా అనే విధంగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.
మూడు రాజధానుల విషయంలో మండలిలో ఛైర్మన్ నిర్ణయం..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ..ఇలా వరుసగా తగులుతున్న షాక్ లు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు సవాల్ గా మారుతున్నాయి. అయితే, అసలు వైఫల్యం ఎక్కడ ఉందనే దాని పైన విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..ఒక రకంగా వైసీపీ నేతలు పైకి ధీమాగా మాట్లాడుతున్నా..చంద్రబాబు పైన ఎదురుదాడికి దిగుతున్నా..లోలోపల మాత్రం అవమానంగానే భావిస్తున్నారు. దీంతో..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విచిత్రంగా ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడల పైన పోరాటం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమవుతోంది.
ఏపీలో ఎన్నికలు వాయిదా పడినా ఆ ఐదువేల కోట్లకు ఢోకా లేనట్లేనా ? మరి జగన్ ఎందుకలా చెప్పారు ?
చంద్రబాబు కోరుకున్నదే జరగుతోందా..
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావొస్తోంది. ఎన్నికల్లో టీడీపీని కోలుకోలేని దెబ్బ తీసి..ముఖ్యమంత్రి అయిన జగన్..కేబినెట్ కూర్పు నుండి తన మేనిఫెస్టో హామీల అమలు వరకు అన్నింటా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఎన్నికల్లో వైసీపీ గెలుపు అడ్డుకోలేకపోయిన చంద్రబాబు..ప్రభుత్వాన్ని కీలక అంశాల్లో ఇరుకున పెట్టటంలో మాత్రం తన అనుభవం మొత్తం ప్రయోగిస్తున్నారు.
అమరావతి నుండి రాజధాని తరలింపు..మూడు రాజధానుల వ్యవహారం పైన జగన్ సభలో ప్రకటన చేసిన సమయం నుండి చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. కేబినెట్ లో నిర్ణయం..అసెంబ్లీలో మూడు రాజధానులు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ఆమోదించుకున్న వైసీపీ ప్రభుత్వానికి..శాసనమండలిలో ఊహించని విధంగా సీన్ రివర్స్ అయింది. అక్కడ సైతం మండలి ఛైర్మన్ తనకున్న విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా ప్రకటించటం ..ప్రభుత్వానికి రుచించలేదు. వెంటనే మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని ఛైర్మన్ ను శాసించారని.. వైసీపీ ఆరోపించింది. అయితే, ఆ సెలెక్ట్ కమిటీకి బిల్లుల వ్వవహారంపైన ఇప్పటికీ స్పష్టత లేదు.
తాజాగా ఎన్నికల వాయిదాలోనూ..
ముఖ్యమంత్రిగా జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం న్యాయస్థానాల్లోనూ తమ వాదన వినిపించింది. ఎన్నికలు పూర్తి చేయటం ద్వారా కేంద్రం నుండి రావాల్సిన నిధులు..ఇక, వచ్చే నెల నుండి పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని జగన్ భావించారు.
స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించి తన రెండో ఏటా పాలనలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ప్రభుత్వంతో ఎటువంటి సమాచారం లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసింది. అయితే, ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిని లేఖ బయటకు వచ్చింది.
చంద్రబాబు ఒత్తిడితోనేనా...
చంద్రబాబు ఒత్తిడి కారణంగానే రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసారని స్వయం గా ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. మంత్రులంతా వరుసగా ఇదే రకంగా మాట్లాడుతూ వచ్చారు. వారంతా చంద్రబాబు కారణంగానే ఎన్నికలు ఆగిపోయాయని చెబుతున్న సమయంలోనే.. ఇంకా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా..చంద్రబాబు పెత్తనం సాగుతుందనే అంశాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తోందనే విశ్లేషణలు మొదలయ్యాయి.ప్రభుత్వం చంద్రబాబు కారణంగానే నాడు మండలిలో బిల్లులు..నేడు ఎన్నికల వాయిదా అని చెప్పటం ద్వారా కొత్త చర్చకు కారణమయ్యారు.
Recommended Video
ప్రభుత్వంలో ఎక్కడ వైఫల్యం..
సాధారణంగా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన ప్రతిపక్షం పోరాటం చేస్తుంది. కానీ, ప్రతిపక్ష నేత ప్రభావంతో తమ నిర్ణయాలు అమలు జరగటం లేదనే ఆవేదన ఇప్పుడు అధికార పక్షం నుండి వ్యక్తం కావటం కొత్తగా కనిపిస్తోంది. అయితే, లోతుగా అధ్యయనం చేయటం ..జరిగే పరిణామాలు..అవకాశాల పైన పూర్తి స్థాయిలో అంచనా వేయటంలో ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రికి నివేదించటంలో విఫలమవుతున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
అదే సమయంలో కొందరు ప్రభుత్వ ముఖ్యులు అతి విశ్వాసంతో వ్యవహరిస్తున్నారని..ముఖ్యమంత్రికి సైతం సరైన సమాచారం ఇవ్వటంలో సరైన రీతిలో వ్యవహరించటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, వైసీపీ నేతలే పరోక్షంగా ఇంకా చంద్రబాబు అనుకున్న విధంగానే తమ ప్రభుత్వంలోనూ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పటం..ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైంది.