ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఆర్డీఏని రద్దు చేసి ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ పేరిట కొత్త చట్టాన్ని తీసుకురావచ్చునన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు రాజధాని అంశం టీడీపీ అధినేత చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారడంతో.. రేపటి అసెంబ్లీ సమావేశాలను ఎలా అడ్డుకోవాలన్న ఆలోచనలో వారు ఉన్నట్టు సమాచారం.
కుట్ర జరుగుతోందా..?
ఏపీ భవిష్యత్తుపై సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో.. సమావేశాలను అడ్డుకునేందుకు అమరావతిలో అలజడి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అమరావతి జేఏసీ ముసుగులో కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్కు సమాచారం కూడా అందినట్టుగా చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను రప్పించి అమరావతిలో అలజడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాళ్ల దాడులు,భౌతిక దాడులతో ఎమ్మెల్యేలను సమావేశాలకు రాకుండా చేయాలని టీడీపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో పోలీసుల అలర్ట్..
ఆదివారం రాత్రి టీడీపీ నేతలు కూడా రాజధాని గ్రామాల్లో ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ రాత్రికి అక్కడే ఉండి దాడులకు వ్యూహా రచన చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల తీరుతో స్థానిక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లోకి ఇతరులు రావద్దంటూ ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
144 సెక్షన్ అమలు..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎప్పటిలాగే రాజధానిలో 144 సెక్షన్,సెక్షన్ 30 అమలులోకి తీసుకొచ్చారు. ర్యాలీలు,అసెంబ్లీ ముట్టడులు,ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పలువురు ఆందోళనకారులను ముందస్తు అరెస్టులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
రేపే తేల్చేస్తారా..?
ఏపీ రాజధాని అంశంపై ఇంకా నాన్చవద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై తేల్చేయాలని జగన్ మంత్రులతో చర్చించినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రాజధానిపై ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా సోమవారం ఏపీ భవిష్యత్తుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.