ఎమ్మెల్సీలుగా జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు ప్రమాణ స్వీకారం!
అమరావతి: శాసన మండలి సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకుడు, ఏపీ ఎన్జీఓ మాజీ ఛైర్మన్ పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి ఛైర్మన్ షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి నిబంధనల పుస్తకాన్ని అందజేశారు. జంగా కృష్ణమూర్తి వెంట వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అశోక్ బాబు ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవికి జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శాసన సభ్యుల కోటాలో మొత్తం అయిదు స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు టీడీపీ నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్ఆర్ సీపీ తరఫున జంగా కృష్ణమూర్తి నామినేషన్ వేశారు. పోటీ అంటూ ఎవరూ లేకపోవడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయకుడు ఇదివరకే ప్రమాణ స్వీకారం చేశారు.