అగ్రి చట్టాలపై వైసీపీ, టీడీపీ యూటర్న్- పార్లమెంటులో మద్దతిచ్చి- రైతుల ఆగ్రహంతో వెనక్కి
కేంద్రం పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు రైతులతో పాటు విపక్షాలు కూడా వ్యతిరేకించాయి. చివరికి మిత్రపక్షమైన అకాలీదళ్ ఈ కార్పోరేట్ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రం నుంచే తప్పుకుంది. రాజ్యసభలో ఈ బిల్లులు గట్టెక్కుతాయో లేదో అన్న అనుమానంతో కేంద్రం ఉంది. అలాంటి సమయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వాములుగా లేకపోయినా, మేమున్నాం అంటూ ముందుకొచ్చి వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించాయి. ఆ రోజు కేంద్రం అడగకపోయినా వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు రైతుల ఆగ్రహంతో యూ టర్న్ తీసుకున్నాయి. విపక్షాలతో కలిసి భారత్ బంద్లో పాల్గొంటున్నాయి.
వ్యవసాయ చట్టాలపై టీడీపీ, వైసీపీ...
కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలు ఏ రైతుల కోసం అని చెపుతున్నారో ఆ రైతులే వ్యతిరేకిస్తున్నారు. అప్పటికే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. తమకు ఇవి ఏ విధంగానూ ఉపయోగపడబోవని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పరిస్ధితి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా పార్లమెంటులో తమకున్న 27 మంది ఎంపీలను వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా ఓటేయించింది వైసీపీ. మరోవైపు టీడీపీ సైతం తమకున్న నలుగురు ఎంపీలతో అడక్కుండానే వ్యవసాయ బిల్లులపై కనీస అభ్యంతరాలు లేవనెత్తకుండా మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లుల్లో కనీస సవరణలకు కూడా ఈ రెండు పార్టీలు ప్రతిపాదించలేదు.దీంతో కేవలం వైసీపీ, టీడీపీ సాయంతోనే ఈ నల్ల చట్టాలు అమల్లోకి వచ్చేశాయి.
ఏపీని తాకిన రైతుల నిరసనల సెగ...
ఎక్కడో హర్యానా, పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తుంటే దాంతో మనకేం సంబంధం అనుకున్న వైసీపీ, టీడీపీకి ఆ సెగ తగిలేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఉత్తరాది రైతులతో పోలిస్తే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర అంశాల్లో వెనుకబడి ఉన్న మన రైతులు ఈ కార్పోరేట్ వ్యవసాయ బిల్లులను సైతం అంత త్వరగా అర్ధం చేసుకోలేకపోయారు. కానీ రైతుల ఆందోళనలు ఓ దశ దాటిన తర్వాత క్రమంగా ఏఫీలోనూ రైతులకు అర్ధం కావడం మొదలుపెట్టాయి. దీంతో బహిరంగంగా కాకపోయినా పార్టీ అధినాయకత్వాలపై రైతు నేతల ఒత్తిడి మొదలైంది. ముఖ్యంగా రైతులు ప్రకటించిన భారత్ బంద్కు మద్దతివ్వకపోతే రైతు వ్యతిరేకులుగా మిలిగిపోతామన్న భయం వీరిలో తలెత్తింది. దాని ఫలితమే భారత్ బంద్కు ఇరుపార్టీల మద్దతు..
వైసీపీ, టీడీపీ యూ టర్న్
పార్లమెంటులో అందరికంటే ముందు ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణంగా మద్దతిచ్చి గట్టెక్కించిన వైసీపీ, టీడీపీ రైతుల ఆగ్రహంతో డైలమాలో పడ్డాయి. ముఖ్యంగా భారత్ బంద్కు మద్దతివ్వకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవనే అంచనాకు వచ్చేశాయి. దీంతో పార్లమెంటులో తాము గట్టెక్కించిన బిలుల్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే భారత్ బంద్కు మద్దతిచ్చేందుకు ఇరుపార్టీలు సిద్ధమయ్యాయి. తద్వారా వ్యవసాయ బిల్లులపై తమకు ఓ స్టాండ్ అంటూ లేదని ఇరుపార్టీలు చెప్పకనే చెప్పేశాయి. అదే సమయంలో కేంద్రానికి ఇన్నాళ్లూ ప్రతీ అంశంలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ దాని వల్ల కలిగే నష్టాన్ని కొంత మేర అర్ధం చేసుకున్నాయని కూడా చెప్పవచ్చు.
వైసీపీ, టీడీపీ తీరుపై బీజేపీ ఆగ్రహం..
పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు బేషరతుగా మద్దతిచ్చి ఇప్పుడు విపక్షాల బంద్కు వైసీపీ, టీడీపీ మద్దతివ్వడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే అప్పుడే చెప్పకుండా ఇప్పుడు విపక్ష కాంగ్రెస్తో కలిసి బిల్లులు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం అవకాశవాద రాజకీయమేనని బీజేపీ నేతలు చెప్తున్నారు. అది అంతిమంగా కాంగ్రెస్కే లబ్ది చేకూర్చే అంశమని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ బిల్లులపై ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, వారు సంతోషంగా ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు.