వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం నేడే: 2011 మార్చి12న పార్టీ స్థాపించిన రీజన్ ఇదే
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. 'వైఎస్సార్ సీపీ 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
Recommended Video
లక్ష్మీ పార్వతికి అవమానం: లేని హోదా ఇచ్చారు..అధికారుల తిరస్కరణ: దిద్దుబాటు చర్యలు ప్రారంభం..!
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై వైసీపీ ఆవిర్భావం
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం పలు సంఘటనల నేపధ్యంలో ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి అప్పటి పరిస్థితులు దారి తీశాయి . 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. ఆ తరువాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని దాదాపుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ అధిష్టానం జగన్ ను కాదని రోశయ్యకు పదవిని కట్టబెట్టింది. రోశయ్యకు పదవిని కట్టబెట్టిన తరువాత రాష్ట్రంలో మార్పులు జరిగాయి. ఇక జగన్ విషయంలో కూడా పార్టీలో భిన్న ధోరణి కనిపించింది.
జగన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటానికి కారణం ఇదే
జగన్ ఓదార్పు యాత్ర చేసే సమయంలో ఆయన యాత్రపై కొంతమంది దాడులు చేశారు. ఇది జగన్ ను తీవ్రంగా కలిచివేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తే తనపై దాడులకు పాల్పడటం తీవ్రంగా బాధించింది. ఇక సోనియా గాంధీకి ఐదు పేజీలతో కూడిన లేఖ రాశారు. 150 మంది తనకు మద్దతు పలికినా తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఓదార్పు యాత్ర సమయంలో జరిగిన దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని, పార్టీలో ఉండలేనని చెప్పి లేఖలో పేర్కొన్నారు. 2010 నవంబర్ 29 వ తేదీన జగన్ కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేశారు.
గత తొమ్మిదేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ..అయినా పార్టీని నడిపించిన జగన్
జగన్ తో పాటుగా కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2011 మార్చి 12 వ తేదీన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 చోట్ల, రెండు లోక్ సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక నాటి నుండి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు నడిపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎట్టకేలకు అధికారం చేతపట్టారు.
సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ .. ఏపీలో అధికార పార్టీగా వైసీపీ
తండ్రి బాటలో మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజలలో మమేకం అయిన వైఎస్ జగన్కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం పట్టం కట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంది. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ 10వ వార్షికోత్సవ వేడుక నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేకం .