ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే- సీమ నుంచి నలుగురు- కోస్తాలో ఇద్దరు
ఏపీలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఆరు ఎమ్మెల్సీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో అన్ని సీట్లను వైసీపీ ఏకపక్షంగా గెల్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జాబితా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆరు సీట్లు కూడా వైసీపీ ఖాతాలోకి రానున్నాయి. దీంతో శాసనమండలిలో వైసీపీ బలం కూడా అమాంతం పెరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రకటించిన జాబితాలో పలువురు కొత్త మొహాలతో పాటు సీనియర్లు, పాత వారికీ చోటు దక్కింది.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న స్ధానాలు, ఇప్పటికే ఖాళీగా ఉన్న స్ధానాలు కలుపుకుని మొత్తం ఆరు సీట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 15న ఈ ఆరు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఇక్బాల్, గుమ్మడి సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గుండుమల తిప్పేస్వామి స్ధానంలో కొత్త ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ దీనికి సంబందించిన నోటిఫికేషన్ కూడా ఏపీ ఎన్నికల సంఘం విడుదల చేసింది.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితా ప్రకటన
వైసీపీ తరఫున పోటీ చేసే ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ ఇక్బాల్కు మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, ఉత్తతాంధ్ర నేత దువ్వాడ శ్రీనివాస్, మైనార్టీ మహిళా నేత కరీమున్నీసా, దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథ రెడ్డి, తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం కల్పించారు. ఈ జాబితాలో అత్యంత సీనియర్ మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కాగా.. కరీమున్నీసా, భగీరధరెడ్డి, కళ్యాణ్చక్రవర్తి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు.
హామీ నిలబెట్టుకున్న జగన్
ఇవాళ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిని గమనిస్తే వీరిలో దాదాపుగా అందరూ వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చిన వారే ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి, తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ల మరణం తర్వాత వారి కుటుంబాలను పరామర్శించిన జగన్.. అందులో ఒకరికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ ప్రకటించిన జాబితాలో చల్లా భగీరధరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చారు.
రాయలసీమలో నలుగురు, కోస్తాలో ఇద్దరు
ఇవాళ వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాలో రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ ప్రాతినిధ్యం దక్కింది. రాయలసీమ నుంచి ఏకంగా నలుగురికి చోటు కల్పించారు. కోస్తాంధ్ర నుంచి ఇద్దరికి చోటు దక్కింది. గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేసి, మాజీ మంత్రిగా కూడా వ్యవహరించిన కడప జిల్లా సీనియర్ నేత సి.రామచంద్రయ్యతో పాటు రాయలసీమ నుంచే బల్లి కళ్యాణ్ చక్రవర్తి, భగీరధరెడ్డి, ఇక్బాల్కు చోటు దక్కింది. విజయవాడకు చెందిన కార్పోరేటర్ కరీమున్నీసాతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీలక నేత దువ్వాడ శ్రీనివాస్కు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.