కామినేనిపై నాగార్జున ఫైర్! రాజీనామా చేయాలని డిమాండ్
హైదరాబాద్ : డెంగీ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఇదేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఇదే విషయంపై వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున.. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
అసలు రక్తపోటును కూడా పరీక్షంచడం చేతగాని కామినేని శ్రీనివాస్ ఎంబీబీఎస్ పట్టా ఎలా సంపాదించారని ఎద్దేవా చేశారు నాగార్జున. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతుంటే మంత్రి కామినేని శ్రీనివాస్ కు మాత్రం అవేవి పట్టడం లేదని ఆరోపించారు. డెంగీ, చికెన్ గున్యా లాంటి వ్యాధులను అరికట్టడానికి అవసరమైన చర్యలేవి ఇంతవరకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మంత్రి కామినేని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నాగార్జున. ఇక సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆలోచనలన్ని కేసులు కాంట్రాక్టుల్లో వాటాలు, కమిషన్ల చుట్టే తిరుగుతుంటాయని, మంత్రులు కూడా కమిషన్లపై ఫోకస్ పెడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.