సభలో ఘాటు వ్యాఖ్యలు: 'కాల్ మనీ బాబు' 'జగన్ దొంగల ముఠా లీడర్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు మొదటి రోజే కాల్ మనీ వ్యవహారం వేడెక్కింది. కాల్ మనీ కేసులో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. కాల్ మనీ పైన వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.
దీంతో కాల్ మనీ పైన చర్చకు వైసిపి పట్టుబడింది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... కాల్ మనీ పైన రేపు చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ఇప్పుడే కావాలంటూ వైసిపి పట్టుబట్టింది.
ఈ సందర్భంగా టిడిపి, వైసిపిలు పరస్పరం పార్టీ అధినేతలతో నిందితులు ఉన్న ఫోటోలు బయటపెట్టారు. చంద్రబాబుతో బోడె ప్రసాద్ ఉన్న ఫోటోలను వైసిపి ప్రదర్శిస్తే, దూడల రాజేష్తో జగన్ ఉన్న ఫోటోలను టిడిపి బయటపెట్టింది.
'కాల్ మనీ చంద్రబాబు' అంటూ వైసిపి సభలో నినాదాలు చేసింది. వారు ప్లకార్డులు పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. వెల్లోకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా కాల్వ ధ్వజమెత్తారు. విజయవాడను నేరమయం చేసిందే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు.
బీఐసీ సమావేశానికి చంద్రబాబు వచ్చినా జగన్ రాలేదని విమర్శించారు. జగన్ దొంగల ముఠా నాయకుడని కాల్వ మండిపడ్డారు. కాల్ మనీలో ఉన్నదంతా వైసీపీ నేతలేనని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. విలువైన సభా సమయం వృధా చేయవద్దన్నారు. సభా సమయం వృథా చేయవద్దన్నారు. సభలో గందరగోళం చెలరేగడంతో సభాపతి పది నిమిషాలు వాయిదా వేశారు.