బాబు వల్లే భూమా క్షోభ.. ఆ మాట నిలుపుకోనందుకే ఇలా!:వైసీపీ
భూమా వైసీపీలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్ గా కేబినెట్ హోదా ఇచ్చి గౌరవించామని అన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రిపదవి ఆశచూపి.. పార్టీలో చేర్చుకున్నారని, అది నెరవేరకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురైన
విజయవాడ: భూమా అకాల మరణంతో నిన్న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడగా.. నేటి సభలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం జరిగింది. అయితే ఈ తీర్మానానికి వైసీపీ దూరంగా ఉండటంతో.. అధికార పార్టీ సభ్యులు సభలో పలు విమర్శలు చేశారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైసీపీ సభ్యులు సంతాప తీర్మానానికి దూరంగా ఉండటం పట్ల వివరణ ఇచ్చారు. దీనిపై పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి ఈ ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భూమా నాగిరెడ్డికి తమ పార్టీలో దక్కినంత గౌరవం టీడీపీలో దక్కలేదని వారు గుర్తుచేశారు.
భూమా వైసీపీలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్ గా కేబినెట్ హోదా ఇచ్చి గౌరవించామని అన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం మంత్రిపదవి ఆశచూపి.. పార్టీలో చేర్చుకున్నారని, అది నెరవేరకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురైన భూమా అదే క్షోభతో మరణించారని పేర్కొన్నారు. భూమాను మోసం చేసినవారితో కలిసి సంతాప తీర్మానంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్టీఆర్ ను, ఇప్పుడు భూమానాగిరెడ్డిని చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారని, ఇలా చేయడం ఆయనకు అలవాటేనని ఆరోపించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే తయారైందన్నారు.