ఉప ముఖ్యమంత్రిపై వైఎస్ఆర్ సీపీ తరఫున మహిళా అభ్యర్థి పోటీ?
కాకినాడ: ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ.. అభ్యర్థులు వేగంగా మారిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీని ఢీ కొట్టగలిగే సత్తా ఉన్న వారికి అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. తాజాగా- తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడిగా గుర్తింపు ఉన్న తోట కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం చూసుకుంటోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన తోట నర్సింహం రేపో, మాపో వైఎస్ఆర్ సీపీలో చేరడం ఖాయమైంది. తనతో పాటు తన భార్యకు టికెట్ ఇవ్వాలంటూ తోట నర్సింహం పెట్టిన షరతులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సరేననడంతో చేరిక ఇక లాంఛనమే.
తోట నర్సింహం భార్య తోట వాణికి పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్థానం తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మినబంటు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం ఇది. ఆయనకు గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వైఎస్ఆర్ సీపీ నాయకులు అన్వేషిస్తున్నారు.
అదే సమయంలో తోట నర్సింహం కుటుంబం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం కలిసి వచ్చే విషయంగా భావిస్తోంది. తోట వాణికి పెద్దాపురం టికెట్ ఇవ్వడం వల్ల చినరాజప్పపై గట్టి అభ్యర్థిని నిలబెట్టినట్టువుతుందని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించుకుంది. పార్టీలో చేరిన వెంటనే తోట వాణి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేస్తారని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి సుమారు 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన తోట సుబ్బారావు నాయుడుకు 65, 251 ఓట్లు పడగా.. చినరాజప్పకు 75, 914 ఓట్లు పోల్ అయ్యాయి. ఆ తరువాత సుబ్బారావు నాయుడు పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. దీనితో వైఎస్ఆర్ సీపీ కొత్త ముఖం కోసం వెదుకుతోంది.
దొరబాబుకు కాకినాడ లోక్ సభ?
ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకుడిగా ఉన్న ప్రవాస భారతీయుడు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దవులూరి దొరబాబును కాకినాడ లోక్ సభ టికెట్ ఇచ్చి, ఆయన స్థానంలో తోట వాణిని నిలబెట్టాలని యోచిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా దొరబాబు అంగీకరిస్తేనే.. అనే మెలిక కూడా ఉంది. దొరబాబు ఇప్పటికే నియోజకవర్గంలో చాలా ఖర్చు పెట్టారని, ఆయనను తప్పిస్తే, అసంతృప్తి వ్యక్తమౌతుందనే అభిప్రాయాలను వైఎస్ఆర్ సీపీ నాయకులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.