మోడీ ముందు బాబు ఎక్స్ప్రెషన్స్ చూశారా?: బొత్స, అంతలేదు.. బాంబుపేల్చిన జీవీఎల్
Recommended Video
అమరావతి: నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు అమరావతిలో మాట్లాడిన దానికి, ఢిల్లీలో చూస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏపీ సీఎం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
అంతా బాగుందా: దగ్గరకు వచ్చి మరీ మోడీ, బాబు దిమ్మతిరిగే జవాబు, 'ప్రధాని హామీలు నెరవేరుస్తానన్నారు'
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీని విపక్ష పార్టీల సీఎంలు కలిసిన సమయంలో తీసిన ఫోటోలను చూపిస్తూ బొత్స విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లి భూకంపం పుట్టిస్తారని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీని నిలదీస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందన్నారు.
చంద్రబాబు ఎక్స్ప్రెషన్స్ చూస్తే భయాన్ని కవర్ చేసుకోవడం కనిపిస్తోంది
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి నీతి ఆయోగ్ సమావేశంలో దులిపేస్తారని, అవసరమైతే వాకౌట్ చేస్తారని చెప్పారని, కానీ అక్కడకు వెళ్లి ఆఖరుకు నరేంద్ర మోడీకి వంగి వంగి దండాలు పెట్టారని బొత్స ఎద్దేవా చేశారు. మోడీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో కనిపించిన ముఖ కవళికలను చూస్తే తన భయాన్ని కవర్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
అందితే జుట్టు లేకుంటే కాళ్లు
చంద్రబాబుది ఓ వికృత నవ్వు అని బొత్స ఎద్దేవా చేశారు. నాటకాలు ఆడే విషయంలో తనంతటి వారు లేరని చంద్రబాబు మరోసారి నిరూపించారని మండిపడ్డారు. అసలు చంద్రబాబుది పోరాడే నైజం కాదని, అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే రకం అన్నారు.
కాళ్ల బేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు యుద్ధంలా కనిపిస్తోంది
ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీలో చంద్రబాబు యుద్ధం చేస్తున్నట్లుగా లేదని, ఓటుకు నోటు కేసు భయంతోనే ఆయన ప్రధాని మోడీ ముందు మోకరిల్లారని వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ కొనసాగుతోందన్నారు. దానికి నిదర్శనమే ఢిల్లీలో మోడీ వద్ద చంద్రబాబు వేసిన వేషాలు అన్నారు. అదేమిటో మోడీతో కాళ్ల బేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు మాత్రం ఆయన యుద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. మోడీతో చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీపై బాంబు పేల్చిన జీవీఎల్
నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు కేంద్రంతో యుద్ధ వైఖరి అనుసరించారంటూ టీడీపీ చేసిన ప్రచారంపై బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు స్పందించారు. 'నీతి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాలు ప్రచారం చేసింది. సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. చంద్రబాబు 12 నిమిషాలు మాట్లాడారు. అయితే సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టీడీపీ తప్పుడు ప్రచారం పూర్తిగా ఈ చిత్రాల ద్వార బహిర్గతం. ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటే ఇదేనా..!' అని ప్రధాని మోడీతో చంద్రబాబు నవ్వుతూ మాట్లాడుతున్న చిత్రాలను ట్వీట్ చేశారు.
ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు అన్నది చంద్రబాబే
హోదా కంటే ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారని, ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారని, దానిని ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారని, అయితే వారు ప్రచారాలకు పరిమితమై ప్రజల అభివృద్ధి కోసం పని చేయడం లేదని, ప్రజాసంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదని జీవీఎల్ అన్నారు. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్లుగా ఉన్నారన్నారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయమంటే ఇంత వరకు ఎందుకు చేయలేదన్నారు. పోలవరానికి రావాల్సిన నిధులు త్వరలో రాబోతున్నాయన్నారు. నాబార్డు ద్వారా వెంటనే విడుదలవుతాయని తమకు సమాచారం ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ.300 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చిందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తుందన్నారు.