షాక్: టీడీపీXవైసీపీ..ఎన్నికల్లో సహకరించాలని ఎస్సైకి వైసీపీ నేత లంచం? ఏం జరిగింది.. డీఎస్పీ ట్విస్ట్
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కేసుల పోరాటం కొనసాగింది. వైసీపీ నేత ఒకరు పోలీసులకు లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా తమను కుట్రలో ఇరికిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
డబ్బుల కవర్లతో వైసీపీ నేత వెళ్లారని ఆరోపణ
మైలవరం, జి కొండూరు.. రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లకు నగదు కవర్లతో ఓ వైసీపీ నేత వెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులు ఉన్న కవర్లను తిరస్కరించిన పోలీస్ అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నగదు తీసుకెళ్లిన నేత మాగంటి వెంకట రామారావుగా గురించారు. మైలవరం వైసీపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ ఈ నగదు పంపారని పోలీసులకు రామారావు తెలిపినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల్లో సహకరించాలని నగదు ఇచ్చే ప్రయత్నం
ఎన్నికల సమయంలో తమకు సహకరించాలని వెంకట రామారావు ఈ నగదును వారికి ఇచ్చే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. వెంకట రామారావు... కృష్ణప్రసాద్ అనుచరుడు. తమకు డబ్బులు ఇవ్వజూపారని జి.కొండూరు ఎస్సై ఫిర్యాదు చేశారు.
అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని వైసీపీ ప్రశ్న
ఈ ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒత్తిళ్ల కారణంగా ఇలా కేసు పెట్టారని మండిపడుతున్నారు. ఇదంతా నాటకం, డ్రామా అని చెప్పారు. సదరు ఎస్సై కేవలం ఖాకీ డ్రెస్ మాత్రమే వేసుకున్నారని, కానీ ఆయన దేవినేని ఉమకు మద్దతుదారు అని ఆరోపిస్తున్నారు. అసలు అలా డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికలకు ముందు ఆడుతున్న డ్రామా అన్నారు.
వైసీపీ నేత కృష్ణప్రసాద్ ఏమన్నారంటే
దీనిపై వైసీపీ నేత కృష్ణప్రసాద్ తీవ్రంగా స్పందించారు. పోలీసులకు మా అనుచరులు ముడుపులు ఇచ్చే ప్రయత్నం అవాస్తవమని చెప్పారు. వైసీపీ నేతలపై మైలవరం సీఐ అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని చెప్పారు. సీఐ తీరుపై డీఎస్పీకి ఇప్పటికే ఫిర్యాదు చేశానని చెప్పారు. డబ్బులు ఇచ్చేవాళ్లమే అయితే డీఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేశామని ప్రశ్నించారు. పోలీసులకు ముడుపులు ఇచ్చామని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు.
కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై డీఎస్పీ ట్విస్ట్
లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై కృష్ణప్రసాద్ కొట్టి పారేస్తూ, తాము డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై డీఎస్పీ స్పందించినట్లుగా తెలుస్తోంది. అసలు కృష్ణప్రసాద్ తనకు ఫిర్యాదు చేయలేదని చెప్పారని సమాచారం.