వైఎస్సార్సీపీ బస్సు యాత్ర:జగన్ పాలనలోనే సామాజిక న్యాయం; ప్రశంసించిన మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్సీపి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో వైయస్సార్సిపి నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రల పోస్టర్లను ఏపీ మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించి సామాజిక న్యాయ భేరి యాత్ర విజయభేరి అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి సామాజిక న్యాయ భేరి పోస్టర్ ను ఆవిష్కరించిన ఆమె రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 75 శాతం బలహీన వర్గాలకే అందుతున్నాయి అంటే సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఎంతగా పరితపిస్తుందో అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.
ఇక 25 మంది సభ్యులున్న ఏపీ క్యాబినెట్ లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు జగన్ స్థానం కల్పించడం సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని మంత్రి విడదల రజిని వెల్లడించారు. బీసీల ఉనికిని చాటేలా 56 కార్పొరేషన్ లను ఏర్పాటు చేసిన చరిత్ర ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిది అని విడదల రజిని పేర్కొన్నారు. ఇక ఈ అంశాలను ప్రజలకు వివరించడం కోసం బస్సు యాత్ర చేపట్టినట్టు పేర్కొన్న విడదల రజిని జగనన్న పరిపాలనలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది అంటూ స్పష్టం చేశారు.
మరోపక్క ప్రతిపక్ష పార్టీలు బీసీలకు జగన్ పాలనలో అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో రెడ్డి రాజ్యం మాత్రమే కొనసాగుతుందని విమర్శలు చేస్తున్న సమయంలో, ఆ విమర్శలకు చెక్ పెట్టడానికి వైయస్ఆర్సిపి న్యాయ భేరి కార్యక్రమంతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు వైయస్సార్ సిపి బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలలోనూ మంత్రులు రెడీ అవుతున్నారు.