అయోధ్య రామిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైతే సరికొత్త రికార్డు.. ఏమిటది..?
హైదరాబాదు: కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుండటంతో రాజకీయాల్లో వేడి తగ్గింది. అప్పుడప్పుడు ఏపీలో రాజకీయాలు కాకమీద ఉన్నప్పటికీ వెంటనే చల్లబడుతున్నాయి. తెలంగాణలో మాత్రం పొలిటికల్ హీట్ అనేది కనిపించకుండా పోతోంది. కరోనావైరస్కు ముందు ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ అఫిడవిట్లను ఫైల్ చేయడం జరిగింది. దీంతో ఎవరు అత్యంత ధనవంతులు అనే విషయంపై జోరుగా చర్చసాగుతోంది.
రాజ్యసభలో అత్యంత ధనికుడైన ఎంపీగా..
కరోనావైరస్కు ముందు విడుదలైన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో అభ్యర్థులు తమ అఫిడవిట్లను దాఖలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇందులో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటికైతే ఎన్నికలు వాయిదా పడ్డాయి కానీ... తాజా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మళ్లీ అదే అభ్యర్థులు దాదాపుగా బరిలో నిలవడం ఖాయం.
అదే సమయంలో అఫిడవిట్లు కూడా తిరిగి అవే సమర్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే వైసీపీ తరపున బరిలో దిగిన రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి అత్యంత ధనవంతుడైన రాజ్యసభ అభ్యర్థిగా రికార్డు నెలకొల్పనున్నారు. అంటే దేశంలోని రాజ్యసభ సభ్యుల్లో రెండో అత్యంత ధనవంతుడిగా అయోధ్య రామిరెడ్డి గుర్తింపు పొందనున్నారు. ఇక వైసీపీకి సంఖ్యా బలం ఉండటంతో అయోధ్య రామిరెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం ఇక లాంఛనమే.
జయా బచ్చన్ను దాటనున్న అయోధ్య రామిరెడ్డి
ఇదిలా ఉంటే బీహార్కు చెందిన జేడీయూ రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ ఇప్పటి వరకు దేశంలోని రాజ్యసభ ఎంపీల్లో అత్యంత ధనికుడిగా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 4,078కోట్లుగా ఉంది. తర్వాతి స్థానంలో రూ.1000 కోట్లతో సమాజ్వాదీ పార్టీనుంచి జయాబచ్చన్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామిరెడ్డి వైసీపీ తరపున పెద్దల సభకు ఎన్నికైతే జయాబచ్చన్ను దాటుకుని రెండో స్థానంలో నిలుస్తారు. అయోధ్య రామిరెడ్డి చరాస్తులు రూ.2376 కోట్లు ఉండగా, స్థిరాస్తులు మాత్రం రూ.17 కోట్లుగా ఉన్నాయి.
ఆయన ఆస్తులు ఎక్కువగా షేర్ల రూపంలో బాండ్ల రూపంలో ఉన్నాయి. అవి రూ. 1997 కోట్లుగా ఉన్నాయి. హైదరాబాదులోని ఉస్మానియా కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసి నిర్మాణరంగంలో అడుగు పెట్టిన అయోధ్య రామిరెడ్డి రాంకీ ఎస్టేట్స్లో అధిక వాటాలు కలిగి ఉన్నారు. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్మైలాక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్లో తన భార్యకు 168 కోట్లు మేరా ఆస్తులున్నాయి.
పరిమల్ నత్యానీ ఆస్తులు ఇవీ
ఇదిలా ఉంటే వైసీపీ తరపున పోటీచేస్తున్న మరో అభ్యర్థి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడైన పరిమాల్ నత్వానీకి రూ.359 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. నత్వానీకి చరాస్తులు రూ.180 కోట్లు ఉండగా స్థిరాస్తుల విలువ రూ. 179 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన పరిమాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు.
Recommended Video
తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ఆస్తులు
ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్కు రూ.33 లక్షల మేరా ఆస్తులు ఉండగా ఎమ్మెల్సీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు రూ. కోటి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఆస్తులు రూ.1.2 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ బరిలో నిల్చున్న కే.కేశవరావు తన ఆస్తులను రూ.2.2 కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ తన ఆస్తులను రూ.14.5 కోట్లుగా పేర్కొన్నారు.