దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి, అప్పుడుతేలిపోతుంది: బాబుకు శ్రీకాంత్రెడ్డి సవాల్
అమరావతి: నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఛార్జీషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకున్నా ప్యాకంజీ తీసుకు వస్తామని నాడు చెప్పారని గుర్తు చేశారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు వైసీపీ ఛార్జీషీటును, టీడీపీ మేనిపెస్టోను దగ్గర పెట్టుకొని చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు చతికిలపడ్డారన్నారు. రాష్ట్రంలో మాఫియాను పెంచి పోషించారన్నారు. 2050లో ఏం చేస్తామో చెబుతున్నారని, కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ఊదరగొట్టారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలే కపోయారన్నారు.
ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలను పెంచి పోషించారన్నారు. బాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయన్నారు. నాలుగేళ్లైనా కేబినెట్లో మైనార్టీలకు చోటు లేదన్నారు. కేవలం రూ.13వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చెశారన్నారు. బెల్టు షాపులు రెండింతలు పెరిగాయన్నారు. ప్రతిజ్ఢ అనే పదానికి అర్థమే మార్చారన్నారు. నాలుగేళ్ల పాలనలో అందరినీ అవమానించారని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామా చేశారన్నారు. అమరావతిని ఆయన గ్రాఫిక్స్లో మాత్రమే చూపిస్తున్నారన్నారు. దీక్షల పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మారెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేస్తే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని చంద్రబాబుకు సవాల్ విసిరారు.