పవన్ బాధపడి లాభంలేదు, నావల్ల వైసీపీ ఓటమి: జగన్, టీడీపీ గెలిచే సీట్లపై జోస్యం
Recommended Video
అమరావతి: గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదని, వచ్చే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ఆలోచన ఉందని, బీజేపీతో ఎలాంటి లాలూచీ లేదని, గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన వైఖరి కూడా కారణమని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు.
మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?
ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బీజేపీతో తమకు ఎలాంటి లాలూచీ లేదని జగన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో తమ పార్టీ మెతక వైఖరితో లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడికి తాను సున్నా మార్కులు వేస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నరేంద్ర మోడీని తాను ఎన్నోసార్లు విమర్శించానని చెప్పారు. కేంద్రం ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని స్వయంగా చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారని విమర్శించారు.
దేవుడు ఆశీర్వదిస్తే 2019లో ముఖ్యమంత్రిని
దేవుడు ఆశీర్వదిస్తే తాను 2019లో ముఖ్యమంత్రిని అవుతానని జగన్ చెప్పారు. నేను అందరి దేవుళ్లను నమ్ముతానని తెలిపారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు తిరుపతికి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు మసీదులకు, చర్చిలకు వెళ్తే తప్పులేదా అని ప్రశ్నించారు. నేను నా మనస్సాక్షిని నమ్ముతానని, అందరు దేవుళ్లను నమ్ముతానని చెప్పారు.
టీడీపీకి 40 సీట్లు రావు, ఇప్పటి వరకైతే పొత్తుల్లేవు!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 సీట్లకు మించి రావని జగన్ జోస్యం చెప్పారు. ఇప్పటి వరకైతే గత ఎన్నికల్లాగే ఈసారి కూడా తాము ఒంటరిగా వెళ్లాలని చూస్తున్నామని జగన్ చెప్పారు. ఏ పార్టీతోను తమకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. ఇప్పటి వరకేనని చెప్పడం ద్వారా పొత్తులను కొట్టి పారేయలేదు. ఎన్నికల విషయంలో మా వ్యూహం మాకు ఉందన్నారు. పొత్తుల గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదని చెప్పారు.
ఓటమికి నా కొన్ని నిర్ణయాలు కారణం
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన నిర్ణయాలు కూడా కొన్ని కారణం కావొచ్చని జగన్ అంగీకరించారు. 2014లో పార్టీ ఓటమిలో తన కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పారు. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశానని తెలిపారు. అయినా పొరపాట్లు చేయని మనిషి ఎవరున్నారని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధపడి లాభంలేదు
రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీ, టీడీపీతో పాటు జనసేనకు కూడా పాత్ర ఉందని జగన్ ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించారని చెప్పారు. చంద్రబాబు అవినీతిపరుడు అని జనసేనాని ఇప్పుడు బాధపడటంలో ఏమాత్రం అర్థం లేదన్నారు. గత ఎన్నికల్లో అన్ని రకాలుగా కలిసి వచ్చి చంద్రబాబు గెలిచారన్నారు. జనసేన గురించి మాట్లాడుతూ.. అంత దూరం ఆలోచించలేదన్నారు. చంద్రబాబు అబద్దాలకు పవన్, బీజేపీ తోడు కావడం వల్ల టీడీపీ గెలిచిందన్నారు. ఇప్పుడు పవన్ చక్రం, బీజేపీ చక్రం చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఏదో పొడుస్తారనే (ఏదో చేస్తారని) ఆశలు ఎవరికీ లేవన్నారు.
కాంగ్రెస్లో అలా ఉంటుందని తర్వాత తెలిసింది
కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అనుమతి తీసుకొనే అన్నీ చేయాలని జగన్ అన్నారు. ఓదార్పు యాత్ర తలపెట్టిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. తన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి రోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తానని చెప్పారు. కేవలం నాలుగు పేజీలు మాత్రమే ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు తప్పువల్లే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ లేవన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు పెరిగాయన్నారు. ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదన్నారు. మద్దతు ధరపై నాలుగేళ్లుగా చంద్రబాబు లేఖ రాయలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేదని చెప్పారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తే బాధగా ఉందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు ముంచేశారన్నారు.