జగన్ దూకుడు: అమరావతికి షిప్ట్, 25 మంది సిట్టింగ్లకు నోఛాన్స్
25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా వైసీపీ నిరాకరించే అవకాశం కన్పిస్తోంది.పార్టీ కార్యాలయాన్ని అమరావతికి తరలించనున్నారు.
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఆయన సూచనల మేరకు వైసీపీ రానున్న రోజుల్లో తన వ్యూహలను అమలుచేయనుంది. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.ఈ మేరకు అమరావతికి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఎల్గుండి నుండి గుంటూరులో వైసీపీ ప్లీనరీ, ఇక దూకుడే...
గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ వ్యూహలను చిత్తు చేస్తూ కొత్త వ్యూహలను సిద్దం చేస్తోంది.
క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల స్థితిగతుల ఆధారంగా వైసీపీ తన వ్యూహలకు పదును పెడుతోంది. అయితే టిక్కెట్ల కేటాయింపు నుండి ప్రతిదీ రానున్న రోజుల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీదే ఆధారపడనుంది.
చావోరేవో: జగన్ పాదయాత్ర, ప్లీనరీలో ప్రకటన?
అయితే ఇంతకాలంపాటు జగన్ కు సన్నిహితంగా ఉంటే టిక్కెట్లు వస్తాయనే అభిప్రాయం ఉంది.అయితే రానున్న రోజుల్లో ఇక అన్నీ కూడ ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే సాగే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అమరావతికి పార్టీ కార్యాలయం షిఫ్ట్
త్వరలోనే అమరావతికి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చనున్నారు. రాష్ట్ర విడిపోయింది. అమరావతిలోనే అసెంబ్లీ, సచివాలయాన్ని ఏర్పాటుచేశారు. అయితే టిడిపి కార్యాలయం ఏర్పాటైంది. ఇతర పార్టీలు కూడ కార్యాలయాలను ఏర్పాటుచేసుకొంటున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఇంకా కేంద్ర కార్యాలయాన్ని హైద్రాబాద్ నుండి షిఫ్ట్ చేయలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అమరావతికి పార్టీ కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం అమరావతి నుండి పనిచేయడం ప్రారంభం కానుంది.ఈ మేరకు పార్టీ ముఖ్యుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు.
25 సిట్టింగ్ లకు నో ఛాన్స్
రానున్న ఎన్నికల్లో 25 మంది సిట్టింగ్ లకు టిక్కెట్లకు ఇచ్చే పరిస్థితి లేనట్టు కన్పిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో సర్వే నిర్వహించినట్టు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 25 మందికి రానున్న ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో మొండి చేయి చూపే అవకాశం కన్పిస్తోంది. గెలిచేవారికే టిక్కెట్లు కేటాయించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. గెలిచే పరిస్థితి లేకపోతే సిట్టింగ్ లకు కూడ టిక్కెట్లు నిరాకరించే అవకాశం లేకపోలేదు.
ప్రశాంత్ కిషోర్ వ్యూహం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే వైసీపీ ఆచితూచి అడుగులు వేయనుంది. పాదయాత్ర చేయాలని ప్రశాంత్ కిషోర్ జగన్ కు సూచించారు.ఈ మేరకు ఆయన పాదయాత్ర నిర్వహించేందుకు కూడ సన్నద్దమయ్యారు. మరోవైపు టిడిపి వైఫల్యాలను తమ ప్రచారస్త్రాలుగా మలుచుకోనుంది. దీనికితోడుగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఆ పార్టీకి మరింత తోడయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన తమకు పనికొచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్లీనరీ నుండి వ్యూహంలో మార్పులు
వైసీపీ ప్లీనరీ నుండి దూకుడును పెంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ మేరకు ప్లీనరీలో ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయమై చర్చించనున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు జిల్లా, డివిజన్, నియోజకవర్గ స్థాయి నాయకులు ఏం చేయాలనే దానిపై కూడ కసరత్తు చేశారు. ఈ మేరకు ప్లీనరీ వేదికగా నాయకులకు పార్టీ నాయకత్వం దిశానిర్ధేశం చేయనుంది.