పంచాయతీ ఫలితాలతో వైసీపీ పతనానికి నాంది- వైసీపీవి ఫేక్ లెక్కలు- చంద్రబాబు కామెంట్స్
ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా, పోలీసులను వాడుకుని అరాచకాలు చేసిన జనం టీడీపీ వెనుక నిలబడ్డారని చంద్రబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 94 శాతం గెలిచామంటూ వైసీపీ చెబుతున్నవి ఫేక్ లెక్కలే అని చంద్రబాబు ఆరోపించారు. మంత్రులు, ప్రభుత్వం, పోలీసులు ఈ ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైసీపీ ఓటమికి ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటే నిదర్శనం అన్నారు.
పంచాయతీ ఫలితాలతో వైసీపీ పతనానికి నాంది
ఏపీలో తాజాగా వెలువడుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.వైసీపీ పతనానికి ఈ ఫలితాలతో నాంది పడిందన్నారు, ఇది ప్రారంభమని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.90 శాతానికి పైగా గెలవకపోతే మీ పదవులు పీకేస్తానని జగన్ టార్గెట్ పెట్టారని, వీటితో హింస చెలరేగిందన్నారు.
ఈ ఎన్నికల్లో మద్యం, కండబలంతో పాటు అన్నీ ఉపయోగించారని, ఇన్ని చేసినా ప్రజలు నిలబెడ్డారని చంద్రబాబు ప్రశంసించారు. వారే నిజమైన హీరోలు అన్నారు. టీడీపీ నేతలు ముందుండి ఎన్నికల్లో ఎన్ని దాడులు చేసినా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి పోరాడారని చంద్రబాబు తెలిపారు.
పంచాయతీ ఫలితాలపైనా వైసీపీ ఫేక్ లెక్కలు
తాజాగా జరిగిన తొలిదశ ఎన్నికల ఫలితాల్లో 38 శాతం టీడీపీకి అనుకూలంగా వచ్చిందని చంద్రబాబు తెలిపారు. వాస్తవ పరిస్ధితి ఇలా ఉంటే 94 శాతం వైసీపీ గెల్చుకుందని మంత్రులు ఫేక్ లెక్కలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అవన్నీ గాలి కబుర్లే అన్నారు. వైసీపీ ఫలితాలతో కూడా మైండ్గేమ్ ఆడుతోందని చంద్రబాబు ఆరోపించారు. 95 శాతం గెల్చుకున్నారా అని మంత్రి బొత్సను ఆయన ప్రశ్నించారు. టీడీపీ పని అయిపోలేదని, మీ పతనానికి నాందిపడిందని వైసీపీ సర్కారును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బలవంతపు ఏకగ్రీవాలపై హెచ్చరిక
రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బలవంతపు ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయో ఆయన లెక్కలతో సహా వివరించారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే విధానం ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ తప్పుడు ఫలితాలను ప్రకటించారని చంద్రబాబు ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించబోమన్నారు. ఎస్ఈసీ, హైకోర్టు సహా అందరికీ వీటిపై ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు.
నల్ల చట్టంపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పట్టుబడితే కేసులు నమోదు చేసి అభ్యర్ధులను అనర్హుల్ని చేస్తామంటూ వైసీపీ సర్కారు ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాల నాయకులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చట్టాన్ని పోలీసులు తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ నల్ల చట్టంపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులను కోర్టుకీడుస్తామన్నారు.
సాయిరెడ్డిపై చంద్రబాబు విసుర్లు
పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ గెలుపోటములు సహజం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్పై స్పందిస్తూ అదే నిజమైతే మీ పతనం ప్రారంభమైంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఓవైపు పార్టీ పెట్టానని జగనన్న వదిలిన బాణం షర్మిల చెబుతుంటే మరోవైపు విజయసాయిరెడ్డి మాత్రం అబద్ధాలు చెబుతున్నారని, నేరాలు చేయడంలోనూ ఆయన దిట్ట అని చంద్రబాబు తెలిపారు. షర్మిల విషయంలోనూ సాయిరెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.