చంద్రబాబు పాదం మోపిన ప్రదేశం - కరవు కాటకాలమయం- అందుకే..!!
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లా పర్యటన అచ్చి రానట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనకు చేదు అనుభం ఎదురైంది. మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న ఆయనకు తొలిసారిగా ప్రతిఘటనలు ఎదురయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆయన పరిస్థితి, పార్టీ స్థితిగతులు ఏమిటనేది ఈ ఘటనతో తేలిపోయింది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడాన్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును జిల్లా అడ్వొకేట్లు అడ్డుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ వ్యతిరేకం..
రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల కిందటే నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే- ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామంటూ ప్రకటించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. న్యాయపోరాటం చేస్తోంది.
చంద్రబాబుకు నిరసనల సెగ..
దీని ప్రభావం ఇప్పుడు ఆయనపై పడింది. కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబుకు న్యాయవాదుల నుంచి నిరసనల సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ను జిల్లా న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ముట్టడించడానికి ప్రయత్నించారు. కర్నూలును న్యాయ రాజధానిగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. హోటల్ ముందు బైఠాయించారు. ఆయనకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినదించారు. ఇవే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
ర్యాలీల హోరు..
పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలను సైతం నిర్వహించారు అడ్వొకేట్లు. మూడు రాజధానులలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడానికి మద్దతు ఇవ్వని చంద్రబాబు గో బ్యాక్ అంటూ బ్యానర్లను ఇందులో ప్రదర్శించారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధానిని తరలించే క్రమంలో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందాన్ని చంద్రబాబు గౌరవించాల్సిందేనని పట్టుబట్టారు న్యాయవాదులు. దీనిపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు.
ఆదోని సభలో..
తన కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు ఆదోనిలో బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. పట్టణంలో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆదోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు వందలాది మంది స్థానికులు హాజరయ్యారు. తనదైన శైలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. తనను మళ్లీ అసెంబ్లీకి పంపించాలని, పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.
పసుపు నీళ్లతో
ఈ సభ అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. బహిరంగ సభను నిర్వహించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారివ్వాళ. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ట్యాంకర్లతో పసుపు నీళ్లను తీసుకొచ్చి శుధ్ది చేశారు. చంద్రబాబు రోడ్ షో జరిగిన ప్రదేశాల్లో ఆ ట్యాంకర్లను తిప్పారు. చంద్రబాబు పాదం మోపిన ప్రాంతాలు కరవు కాటకాలమయం అవుతాయని, అందుకే తాము పసుపు నీళ్లతో శుద్ధి చేశామని వివరణ ఇచ్చారు వైసీపీ నాయకులు. చంద్రబాబు పాదంతో అపవిత్రమైన ఆదోని - పసుపు జలాలతో శుద్ధి కార్యక్రమం అనే బ్యానర్లు, ఫ్లెక్సీలను ప్రదర్శించారు.