వైసీపీ నుంచి 4 వేల కోట్ల వసూలుకు ఏపీ హైకోర్టులో పిటిషన్- ఎందుకో తెలుసా ?
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు... ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం మొదలుపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టినా సుప్రీంకోర్టులో వైసీపీ దాన్ని సవాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీ రంగులు తొలగించక తప్పలేదు. చివరికి వైసీపీ రంగులు వేసి, తీయడం ద్వారా ప్రజాధనం భారీగా వృధా అయింది.
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తొలగించడం ద్వారా రూ.4 వేల కోట్లు ఖర్చయిందని, ఇదంతా ప్రజాధనం వృధాయేనని, దీన్ని వైసీపీ నుంచి రాబట్టాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ నుంచి రూ.4 వేల కోట్ల రూపాయలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ఈ కేసులో సీఎస్తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణను ప్రతివాదులుగా చేర్చారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి తొలగించిన వ్యవహారంపై దాఖలైన కేసును పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం... సీఎస్, మంత్రులను వ్యక్తిగతంగా ఎందుకు ప్రతివాదులుగా చేర్చారని ఆక్షేపించింది. దీంతో ఈ కేసులో అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వైసీపీ రంగులు వేస్తే తిరిగి ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని కోరడంలో స్పష్టత లోపించిందని హైకోర్టు పేర్కొంది. దీంతో పిటిషనర్ త్వరలో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.