ఏబీపై మరోసారి ఎన్నికల అధికారికి ఫిర్యాదు
అమరావతి: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ పైనా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రధానాధికారకి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏబీ వెంకటేశ్వర రావు ప్రస్తుతం విధి నిర్వహణలో లేరు.
ఇంటెలిజెన్స్ బ్యూరో డీజీగా ఆయన పనితీరుపై విమర్శలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై బదిలీ వేటు వేసింది. ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది. పోలింగ్ ముగిసేంత వరకూ ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకూడదని సూచించింది. అయినప్పటికీ..- ఆయన తన పరిచయాలను ఉపయోగించుకుని అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలపై నిఘా వేశారని విమర్శించారు.
డీజీపీ ఆర్పీ ఠాకూర్ పైనా వైఎస్ఆర్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయనపై వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు తరహాలోనే ఠాకూర్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠపై వేటు వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ..ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ జీవో జారీ చేశారని అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తీసుకుందని అన్నారు.