jagan:ప్రజల బ్రహ్మారథానికి ఏడాది, 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి రానీ మెజార్టీ
సరిగ్గా ఏడాది.. ఆంధ్రప్రదేశ్లో నవశకం మొదలై నేటికి ఏడాది. గతంలో ఏ రాజకీయ పార్టీ సాధించని ఓట్లు, సీట్లతో వైసీపీ విజయదుందుబి మోగించింది. ఫ్యాన్ స్పీడ్కు ప్రతిపక్ష టీడీపీ, వామపక్షాలు, బీఎస్పీతో జతకటిన పవన్ కల్యాణ్ పత్తాలేకుండా పోయారు. చినబాబు లోకేశ్, రెండుచోట్ల పోటీచేసిన జనసేనాని పవన్ కల్యాణ్ను ప్రజలు తిరస్కరించారు. చావుతప్పి కన్నులొట్టబోయినట్టు టీడీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లతో నెగ్గి.. ప్రతిపక్షానికే పరిమితమైంది. వైసీపీ ప్రభంజనంతో జనసేన ఒక్క అసెంబ్లీ సీటుకే పరిమితమైంది. అటు కేంద్రంలోనూ కమలం వికసించింది. 2014 ఎన్నికల కన్నా మెజార్టీ సీట్లు సాధించి.. తమకు తిరుగలేదని మోడీ-షా ద్వయం మరోసారి నిరూపించుకున్నారు. వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తవుతున్నందున సింహావలోకనం చేసుకుందాం.
వైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదే
151 సీట్లు
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 151 అసెంబ్లీ స్థానాలను జగన్ పార్టీ కైవసం చేసుకుంది. లోక్సభ స్థానాల్లోనూ ఇదే సీన్ రిపిటైంది. 22 సీట్లతో నెగ్గి అప్రతిహాత విజయం సాధించింది. మొత్తం 50 శాతం ఓట్లు వైసీపీకి పోల్ అవగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 86 శాతం కాగా.. లోక్ సభ ఎన్నికల్లో 92 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా 2019లో వైసీపీ మాదిరిగా విజయం సాధించలేదు. వైసీపీ ప్రభంజానికి ప్రధాన కారణం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 341 రోజులు 3,648 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను స్లోగన్తో ప్రజల ముందుకెళ్లారు. మేనిఫెస్టోలో నవరత్నాలను వివరించి.. అమలు చేస్తానని చెప్పడంతో... ఏపీ ప్రజలు రావాలి జగన్.. కావాలి జగన్ అని బ్రహ్మారథం పట్టారు. వైసీపీ అఖండ విజయంతో టీడీపీ, జనసేన బొక్కబొర్లా పడ్డాయి.
23 సీట్లు..
2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టేందుకు చంద్రబాబు కొత్త ఎత్తులతో ముందుకెళ్లారు. కానీ జనం మాత్రం విశ్వసించలేదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేనకు మళ్లించాలని చూశారు. కానీ ఆ పార్టీ కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు. జనసేన.. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న ప్రజలు మాత్రం విశ్వసించలేదు. లోకేశ్ పోటీచేసినా మంగళగిరిలో జనసేన అభ్యర్థిని బరిలోకి దిగలేదు. మంగళగిరితోపాటు కుప్పంలో కూడా తమ మిత్రపక్షాల కోసం పవన్ కల్యాణ్ ప్రచారం చేయలేదు. ప్రతీగా పవన్ పోటీచేసిన గాజువాక, భీమవరంలో చంద్రబాబు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయలేదు. దీంతో వారి మధ్య అండర్ స్టాండింగ్ ఎంటో అర్థమవుతోంది. ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు వేదిక పంచుకొని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇవేమీ ప్రజల ముందు నిలవలేదు. కేవలం 23 సీట్లలో మాత్రమే టీడీపీ గెలించింది. లోకేశ్, 19 మంది మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్కు ఓటమి తప్పలేదు. 4 జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు గెలుచుకోలేదంటే.. అదీ ప్రజలు వైసీపీ పట్ల చూపిన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. రెండుచోట్ల పోటీచేసినా పవన్ కల్యాణ్ ఓడిపోయారు. జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతయ్యాయి.
నవరత్నాలు..
గతేడాది మే 23వ తేదీన ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 31వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటినుంచి ఇచ్చిన హామీల అమలు కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నవరత్నాల్లో చెప్పిన విధంగా రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు. రైతు భరోసా నిధులను వాయిదాల కింద అందజేస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నా.. కరోనా వైరస్తో ఇబ్బందులు ఉన్నా.. నవరత్నాల కోసం సీఎం జగన్ నిధులు కేటాయిస్తున్నారు. రైతు కుటుంబాలకు భీమా, సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తున్నారు. మద్యపాన నిషేధం కోసం వినూత్న విధానం తీసుకొచ్చారు. అంతేకాదు మంత్రుల పనితీరుపై అధికారులతో రిపోర్ట్ తీసుకున్నారు. పని సరిగాలేని ఆమాత్యుల పదవీ తీసివేసేందుకు వెనకాడబోమని ధైర్యంగా ముందుకుసాగుతున్నారు.
రూ.వెయ్యి ఎక్కువ
వాస్తవానికి రైతు భరోసా రూ.12,500 అందజేస్తామని జగన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ రూ.వెయ్యి ఎక్కువగా అంటే.. 13500 నగదును రైతులకు అందజేస్తున్నారు. తొలి విడత ఏప్రిల్లో రూ.2 వేల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇటీవల మరో రూ.5500 జమచేశారు.. అక్టోబర్లో మరో 4 వేలు, సంక్రాంతికి మరో 2 వేలు అందజేస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. దీంతో 7 లక్షల రైతులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రైతు భరోసా కేంద్రాలు (ఆర్కేబీ) 10 వేల 600 ఏర్పాటు చేస్తామని.. అక్కడ ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు ఏ పంట వేయాలో తెలియజేస్తారని జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి జనతా బజార్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇందులో పండ్లు, కూరగాయాలు, గుడ్లు, రొయ్యలు, చేపలను విక్రయిస్తారని తెలిపారు. తర్వాత వైఎస్ఆర్ చేనేత బజార్ నెలకొల్పి... చేనేత ఉత్పత్తులను విక్రయిస్తామని జగన్ తెలిపారు.
Recommended Video
బీజేపీ ప్రభంజనం
2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కమలం వికసించగా... హస్తం మాడి మసయిపోయింది. ఎన్నకల్లో 911 మిలియన్ల మంది ఓటేయడంతో 67 శాతం పోలింగ్ నమోదైంది. 37.36 శాతం ఓట్లతో బీజేపీ సింగిల్గా 303 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లతో 353 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. మోడీ-షా ద్వయం.. సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లను సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకే పరిమితం కాగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు 98 సీట్లను గెలుచుకున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 3వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు.