ఎన్నికల వేళ వైసీపీ మరో సంచలనం: నిన్న బీసీలకు రిజర్వేషన్లు.. నేడు?: టీడీపీ ఫాలో కావాల్సిందేనా?
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల్లో పార్టీపరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్ల కోటాకు మించిన టికెట్లను ఇవ్వబోతున్న వైఎస్ఆర్సీపీ తాజాగా..కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తల నుంచి ఎలాంటి విరాళాలను తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు బాండ్ల రూపంలో ఇచ్చే విరాళాలకు ఈ ఎన్నికల వరకు పుల్స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం.
ధనం, మద్య ప్రవాహాన్ని అరికట్టడానికే..
సాధారంగా ఎన్నికల్లో ధనం, మద్య ప్రవాహం కనిపిస్తుంటుంది. ప్రచార కార్యక్రమాల సందర్భంగా డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతుంటారు. మద్యం ఏరులై ప్రవహిస్తుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం కనిపించకూడదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. డబ్బులు, మద్యాన్ని పంచిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించడంలో భాగంగా..
ప్రజాస్వామ్యబద్ధంగా, ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయనివ్వకుండా, వారిపై ఎలాంటి ఒత్తిళ్లు లేకండా ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడానికి వీలు కల్పించేలా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలను స్వీకరించకూడదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలు గానీ, పెట్టుబడిదారులు గానీ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రయోజనాన్ని ఆశించే పార్టీ ఫండ్ ఇస్తుంటారని.. అలాంటి స్వార్థ ప్రయోజనాలకు అడ్డుకట్ట పడేలా వైసీపీ నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది.
Recommended Video
టీడీపీ ఫాలో కాకతప్పదా?
పార్టీ నిర్వహణ, కార్యకలాపాల కోసం కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల నుంచి విరాళాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరించక తప్పదా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అధికార పార్టీ పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలను తీసుకోకుండా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము పార్టీ ఫండ్ను తీసుకోవడం వల్ల ప్రజల్లో అపోహలకు తావిచ్చినట్టువుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.