మీ ఫ్యూడల్,నీచ మనస్తత్వం నచ్చకే బైటకు వచ్చాం...జగన్ కు వైసిపి 'ఫిరాయింపు' ఎమ్మెల్యేల కౌంటర్
అమరావతి:తమ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తేనే శాసన సభ సమావేశాలకు వస్తామంటూ వైఎస్ఆర్సిపి శాసన సభ్యులు రాసిన లేఖకు ఆ పార్టీ 'ఫిరాయింపు' ఎమ్మెల్యేలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఆ లేఖకు సమాధానంగా వారు బుధవారం ప్రతిపక్ష నేత జగన్కు ఒక బహిరంగ లేఖ రాశారు. "మేమంతా మీ ఫ్యూడల్ వ్యవహార శైలి నచ్చకే బయటికి వచ్చాం... రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రిని బలపరిచేలా అడుగులు వేశాం'' అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు జగన్ పై తీవ్రస్థాయిలో అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. అంతకుముందు సిఎం చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేల లేఖపై టిడిపి సమావేశంలో వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చర్చించారు.
పెదబాబు పర్మిషన్.. చినబాబుకు కమిషన్..: కబ్జాకోరులంటూ జగన్ నిప్పులు
లేఖపై...చంద్రబాబు స్పందన
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వైసీపీ శాసన సభ్యుల లేఖపై బుధవారం టీడీపీ సమావేశంలో సిఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ..."టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని...ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గవర్నర్ను కలిసి వచ్చిన అనంతరం జగన్ ప్రకటించాకే వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి" అని పేర్కొన్నట్లు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ టికెట్పై గెలిచిన మేము వైఎస్ మరణం తర్వాత వైసీపీలోకి వెళ్లాం....అప్పుడు మమ్మల్ని రాజీనామా చేసి రావాలని జగన్ అనలేదు. వెళ్లాక కూడా రాజీనామా చేయమనలేదు. స్పీకర్ అనర్హత వేటు వేయడం వల్ల ఎన్నికలు వచ్చాయి తప్ప...జగన్ రాజీనామాలు చేయించలేదని గుర్తు చేశారు. మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ...మేము డబ్బు తీసుకున్నట్లు జగన్ ఆరోపిస్తున్నారు...మేము నోరు తెరిస్తే ఆయన గురించి చాలా విషయాలు బయటకు వస్తాయన్నారు. పార్టీ అనుమతిస్తే అన్నీ చెప్తామని అన్నారు.
జగన్ పై...విమర్శల వర్షం
ఫిరాయింపు ఎమ్మెల్యేలు బహిరంగ లేఖలో జగన్ ను ఉద్దేశించి...‘‘మీకు వయసు లేదు, అనుభవం లేదు, స్వతహాగా వినే నైజం లేదు. కేవలం సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న మీ ఆలోచన భరించలేక... అధికారమే పరమావధిగా, కుట్ర రాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగిస్తూ, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే నీచ మనస్తత్వాన్ని సహించలేక బయటకు వచ్చేశాం''...అని విమర్శల వర్షం కురిపించారు.
ఆ ఆదేశాలు...సహించలేక పోయాం...
పార్టీ అంతర్గత సమావేశాల్లో పట్టిసీమను, పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని...కొత్త రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనివ్వకూడదంటూ మీరు చేసిన ఆదేశాలను మేము జీర్ణించుకోలేకపోయామని...రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని రాజ్భవన్ సాక్షిగా మీరు చేసిన ప్రకటనను సహించలేకపోయామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ లేఖలో పేర్కొన్నారు. మూడు తరాల నేరమయ రాజకీయాలకు, ముఫ్పై ఏళ్ల అవినీతికి జగన్ వారసుడని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభివర్ణించారు.
మీ నాన్న...రాజకీయ పుట్టుకే అది
‘‘కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్షిప్ చూసి సహించలేకే దూరమయ్యాం. ఫ్యాక్షన్ పునాదుల మీద నిర్మించిన మీ ఫ్యూడల్ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక వచ్చేశాం. మీ నాన్న రాజకీయ పుట్టుకే ఫిరాయింపుతో మొదలైందని మీకు గుర్తులేదా?...ఆనాడు సభలో నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి మీ నాన్నను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుసా?...మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లి కూతురిలా నీ (మర్రి చెన్నారెడ్డి) వైపు వెళ్లాడు మా రాజశేఖర రెడ్డి! ఏముంది నీలో ఆకర్షణ?'' అని భాట్టం అన్నారని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గుర్తుచేశారు.
వైఎస్...అలా చేయలేదా?
1978లో రెడ్డి కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్లో చేరి మంత్రి కాలేదా?...1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్ లోకి లాక్కొన్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి?...2004లో 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైఎస్ కాంగ్రెస్ లో చేర్చుకోలేదా?...అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్ వైపు మళ్లించలేదా?...2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదు?...మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా?...ఆ రోజు మీ తండ్రి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? మీ దగ్గరకొచ్చిన వాళ్లకు ఎన్ని కోట్లు ఇచ్చావు?''...అని జగన్పై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్ కు...అర్హత లేదు
మరోవైపు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ప్రతిపక్ష నేత జగన్కు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులను తన లేఖలో గుర్తు చేసిన ఆయన మరి అప్పుడు నైతిక విలువలు గుర్తుకు రాలేదా?...అని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యేలు మీ చేష్టలు నచ్చక మీ మీద తిరుగుబాటు చేసి ఇతర పార్టీల్లో చేరారు...మిగతా ఎమ్మెల్యేలను కూడా బలవంతంగా శాసనసభకు వెళ్లకుండా చేసిన మీకు నైతిక విలువలు గురించి మాట్లాడే అర్హత లేదు'' అని బుధ్దా వెంకన్న లేఖలో స్పష్టం చేశారు.