'వైసిపి నేతలకు భధ్రత కరువు, జగన్కు జడ్ ప్లస్ భద్రత కావాలి'
వైయస్సార్ కాంగ్రెస్ పత్తిపాడు ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పత్తిపాడు ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్ర ఉందని, సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని అంటున్నారు.
చదవండి: పత్తిపాడు టిక్కెట్ ఎవరికో చెప్పిన జగన్
వైసిపి నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు ఈ హత్యపై మంగళవారం మండిపడ్డారు. ఈ సందర్భంగా భూమన... తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
వైసిపి నేతలకు భద్రత కరువు
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైసిపి నేతలకు భద్రత కరువయిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కర్నూలు జిల్లాలోనే ఈ మూడేళ్లలో 300 మంది హత్యకు గురయ్యారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
వైయస్ కుటుంబం అలా చేసి ఉంటే...
నారాయణ రెడ్డి హత్యపై వైసిపి నేతలు టిడిపిపై వేలు చూపిస్తుండగా, అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసునని, ఎవరి హయాంలో రాష్ట్రంలో హత్యలు జరిగాయో తెలుసునని టిడిపి నేతలు వైయస్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. అంతేకాదు, వైయస్ కుటుంబానివి కుట్ర రాజకీయాలన్నారు. దీనిపై వైసిపి స్పందించింది. వైయస్ కుటుంబం కుట్రలు చేసి ఉంటే చంద్రబాబు ఈ పాటికి రాజకీయాల్లో ఉండేవారు కాదని దుమ్మెత్తిపోశారు.
48 గంటలైనా దోషిలపై చర్యలేవి?
నారాయణ రెడ్డి హత్య జరిగి 48 గంటలు దాటినా దోషులపై చర్యలు ఏవి అని వైసిపి నేత శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు. దోషులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదన్నారు. సోషల్ మీడియా వంటి చిన్న కామెంట్లు పెడితేనే అరెస్టు చేస్తున్నారని, అలాంటిది హత్య చేస్తే దోషులను అరెస్టు చేయరా అని నిలదీశారు.
తలపై రాళ్లతో మోదీ హతమార్చారు
పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు తలను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో ఆయన తలపై మోది చంపేశారు. అనంతరం వేటకొడవళ్లతో తలను ఛిద్రం చేసినట్లు పోస్టుమార్టంలో ప్రాథమికంగా తేలింది.