మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఇందులో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని మోడీని మరోసారి కోరారు.
కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్ను ఆయన వినిపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రదాని మోడీ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, దీనికి కరోనా మహమ్మారి ప్రభావం కూడా తోడు కావడంతో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా కల్పించే అధికారాన్ని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం విచక్షణకు వదిలిపెట్టినందున తక్షణమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన కోరారు.