వైసీపీలోకి గంటా ఎంట్రీపై క్లారిటీ - విశాఖ నేతలకు సాయిరెడ్డి సంకేతం- ఊహాగానాలకు చెక్...
ఏపీ రాజధానిగా విశాఖను వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికార పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా స్ధానిక ఎన్నికల వాయిదాకు ముందు వరకూ వీటిపై పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే వీటికి చెక్ పెట్టాలని భావించిన ఎంపీ విజయసాయిరెడ్డి తన విశాఖ పర్యటనలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేశారు.
విశాఖ వైసీపీలోకి గంటా రాక ?
ఒకప్పుడు విశాఖ రాజకీయాల్లో అన్నీ తానై చక్రం తిప్పిన టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతేడాది వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కాదు కదా నియోజకవర్గంలో సైతం కనిపించడం మానేశారు. అధికారం చేతిలో లేకపోవడంతో తన మాట చెల్లదనే నిర్ణయానికి వచ్చేసిన గంటా ఈ మేరకు మౌనాన్నే ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారనే పేరున్న గంటా ఎంతో కాలం మౌనంగా ఉండబోరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ దశలో గంటా వైసీపీలోకి వచ్చేయడం ఖాయమే అనే వరకూ ఈ ప్రచారం వెళ్లింది.
తాజా పరిణామాలతో వైసీపీ క్లారిటీ...
నిన్న మొన్నటి వరకూ విశాఖ వైసీపీలోకి గంటా వచ్చేస్తారని అంతా భావించారు. స్ధానిక ఎన్నికలకు ముందే చేరిక ఉంటుందని కూడా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త రాజధాని విశాఖకు మద్దతుగా మాట్లాడుతూనే మరోవైపు టీడీపీ చేపట్టిన నిరసనలకు దూరంగా ఉన్న గంటా ఏ క్షణాన అయినా వైసీపీలో చేరిపోతారనే అందరూ అనుకున్నారు. కానీ తాజాగా సీన్ మారిపోయింది. స్ధానిక ఎన్నికల వాయిదా, స్ధానికంగా మారుతున్న రాజకీయాలు, భవిష్యత్తులో విశాఖపై వైసీపీ పట్టు ఇలా చాలా విషయాలను పరిగణనలోకి తీసుకున్న వైసీపీ.. గంటాను పార్టీలోకి చేర్చుకునే పరిస్ధితి లేదని తేల్చేసింది.
సాయిరెడ్డి వ్యాఖ్యలతో గంటాకు షాక్..
నిన్న మొన్నటి వరకూ వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్న ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే తాజాగా విశాఖలో పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. గంటా రాకపై క్లారిటీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ప్రజలను మర్చిపోయే అలవాటున్న, ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేసే అలవాటు లేని గంటాను వైసీపీలోకి రానిచ్చే పరిస్ధితి లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు కరోనా సంక్షోభం వేళ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న కేకే రాజు స్ధానికంగా ప్రజల మధ్య తిరుగుతుంటే... విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన గంటా ఎక్కడున్నారని ప్రశ్నించారు. దీంతో గంటాకు వైసీపీలో దారులు మూసుకుపోయినట్లేననే వాదన వినిపిస్తోంది.
Recommended Video
గంటా కంటే కేకే రాజే బెటరన్న భావన...
విశాఖ నార్త్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడం కంటే ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వైసీపీ ఇన్ ఛార్జ్ కేకే రాజును ప్రోత్సహిస్తేనే మంచిదన్న భావన విజయసాయిరెడ్డి మాటల్లో వ్యక్తమైంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గంటా చేతిలో ఓటమిపాలైనా.. వైసీపీ తరఫున ప్రజల్లో నిత్యం తిరుగుతున్న కేకే రాజును భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేకే రాజు క్రియాశీలకంగా ఉండటం ఇప్పుడు వైసీపీకి గంటా అవసరం లేకుండా చేసిందన్న వాదన వినిపిస్తోంది. తరచూ పార్టీలు మారే గంటా కంటే పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్న కేకే రాజు.. అటు అధినేత జగన్ కు కూడా సన్నిహితుడు కావడంతో ఆయన్ను కాదని గంటాను రానిచ్చే పరిస్ధితి లేదని చెబుతున్నారు.