కీలక అంశాలతో వైసీపీ మేనిఫెస్టో సిద్దం.. విడుదల ఆ స్వామి చెప్పిన రోజేనా !?
అమరావతి: కొద్దిరోజులుగా ఎప్పుడెప్పుడా అంటూ ఊరిస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం కుదిరింది. తెలుగు సంవత్సరాది వికారి నామ ఉగాది పండగను పురస్కరించుకుని శనివారం ఉదయం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి వైఎస్ఆర్సీపీ సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయంలో పంచాగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఉగాది పండగ వేడుకలను నిర్వహించబోతున్నారు. పంచాంగ శ్రవణం అనంతరం.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని పార్టీ నాయకులు వెల్లడించారు.
ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, ప్రజల నుంచి అందిన విజ్ఙప్తులను క్రోడీకరించి, మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఇదివరకే వైఎస్ఆర్సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టో కమిటీకి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఛైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీలో సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతో పాటు మొత్తం 31 మంది సభ్యులుగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చెందిన నాయకులను ఈ కమిటీలో చోటు కల్పించారు.
రూ.2 కోట్ల వ్యవహారం: టీడీపీ ఎంపీ మురళీమోహన్ పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
నవరత్నాలకు ప్రాధాన్యత..
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన నవరత్నాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన 'వైఎస్ఆర్ రైతు భరోసా', డ్వాక్రా మహిళల కోసం 'వైఎస్ఆర్ ఆసరా', వృద్ధులకు ప్రతినెలా 2000 రూపాయల పింఛన్, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు ఉచితంగా చదువును చెప్పించడానికి రూపొందించిన `అమ్మ ఒడి`, ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన `ఆరోగ్యశ్రీ`కి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీటి అవసరాలను తీర్చడానికి `జలయజ్ఞం, దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం.. వంటి పథకాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చారు.
కాపీ కొడతారా?
నవరత్నాలను ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని కాపీ చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో ఒకటైన 2000 రూపాయల పింఛన్ హామీని చంద్రబాబు కాపీ చేసి, అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో- తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ.. తన మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం గమనార్హం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైన తరువాత అందులోని కీలక అంశాలను మరోసారి కాపీ చేస్తారనే అనుమానాలను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్నప్పటికీ.. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం వల్ల అలాంటి సందేహాలు వ్యక్తమౌతున్నాయని చెబుతున్నారు పార్టీ నాయకులు.
ఆచరణ సాధ్యం కాని హామీలకు చోటుందా?
అమలు చేయడానికి సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తానంటూ వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే.. అసాధ్యమైన హామీలపై ఎన్నికల మేనిఫెస్టోలో చోటు కల్పించారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకించి- కాపు రిజర్వేషన్ల వ్యవహారం. కాపులకు రిజర్వేషన్లను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేసేంత వరకు మాత్రమే రాష్ట్రం బాధ్యత. కాపుల రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్రం పరిధిలో లేదని, తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశంపై కేంద్రంతో పోరాడుతానని, ఒత్తిడిని తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా చెప్పుకొనే ఉభయ గోదావరి జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో కాపుల రిజర్వేషన్ అంశాన్ని చేర్చినప్పటికీ.. తాము చేస్తామని వైఎస్ఆర్ సీపీ భరోసా ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన ప్రధాన అంశం.. రైతులకు పూర్తి రుణమాఫీ. ఇందులో కౌలు రైతుల విషయాన్ని చేర్చలేదు టీడీపీ నాయకులు. ఈ లోటును వైఎస్ఆర్సీపీ భర్తీ చేస్తుందని అంటున్నారు.
మాఫీ పరిధిలో కౌలు రైతులు
రుణమాఫీని కొనసాగిస్తూనే.. కౌలు రైతులను కూడా దీని పరిధిలోకి చేర్చేలా మేనిఫెస్టోను రూపొందించారని సమాచారం. చేయదగ్గ హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరచాలని జగన్మోహన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో.. అలాంటి వాటిపైనే దృష్టి పెట్టి, తుది రూపాన్ని ఇచ్చారని తెలుస్తోంది. దీనితోపాటు ఎన్నికల ప్రచారంలో జగన్ ఇస్తున్న ఏ ఒక్క హామీని వదలకుండా అన్నింటిని మేనిఫెస్టోలో చేర్చినట్లు చెబుతున్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన జగన్మోహన్ రెడ్డి నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అలంకరిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలు స్పష్టంం చేస్తుండటంతో నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఉగాది పండగ నాడు పంచాంగ శ్రవణం కార్యక్రమంతో పాటు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.