వైసీపీని వెంటాడుతున్న హిందూ వివాదాలు! మొన్న ఈశ్వరుడు..నిన్న తిరుమలేశుడు..నేడు గణేశుడు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందూ వివాదాలు వరుసగా చుట్టుముడుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతూ, గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఊపిరి సలపనివ్వని పరిస్థితిని తీసుకొచ్చాయి. ఒక ఆలయానికి సంబంధించిన వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరొకటి వచ్చి పడుతోంది. ఇందులో- అధికార వైఎస్ఆర్సీపీ పాత్ర ఎంత ఉంది? అనే విషయాన్ని పక్కన పెడితే.. అవకాశం దొరికితే చాలనుకునే రాజకీయ ప్రత్యర్థులకు ఆయా వివాదాలు అయాచిత అస్త్రాలను అందిస్తున్నాయి. నోరారా విమర్శలు చేసే పరిస్థితులను కల్పిస్తున్నాయి. పరిపాలనా పరమైన విమర్శలు, అభివృద్ధి కార్యక్రమాల్లో వివాదాలు లేనందు వల్లే తమ రాజకీయ ప్రత్యర్థులు మతపరమైన అంశాలను తెరమీదికి తీసుకొస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు.
శ్రీశైలంలో ముస్లింలకు దుకాణాలు..
కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి సంబంధించిన దుకాణాల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం వివాదాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. శ్రీలలితాంబికా పేరుతో శ్రీశైలంలో కొత్తగా నిర్మించిన వాణిజ్య భవన సముదాయంలో దుకాణాల కేటాయింపులో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ శ్రీరామచంద్రమూర్తి ముస్లింలకు 30 శాతం షాపులను కేటాయించారు. ఈ వివాదం తీవ్రరూపాన్ని దాల్చడానికి ముందే ప్రభుత్వం అప్రమత్తమైంది. దుకాణాల కేటాయింపు, దీనికి సంబంధించిన వేలంపాటల వ్యవహారం మొత్తాన్ని దేవాదాయ శాఖ రద్దు చేసింది. దీనితోో ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న లోపే.. తిరుమలలో అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. విజయవాడ సమీపంలోని కొల్లూరు గోశాలలో చోటు చేసుకున్న ఆవుల మృత్యువాత పడటం సైతం వైసీపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తిరుమల బస్ టికెట్ల వెనుక..
తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు జారీచేసే టికెట్ల వెనుక..క్రైస్తవులకు జెరూసలేం, ముస్లింలకు హజ్ పర్యటనలకు సంబంధించిన వివరాలను ముద్రించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మైనారిటీ శాఖ నేతృత్వంలో..ఏటా ముస్లింలకు హజ్, క్రైస్తవులకు జెరూసలేం పర్యటనల కోసం నిధులను కేటాయిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆర్టీసీ బస్సులో జారీ చేసిన టికెట్ వెనుక ముద్రించారు. ఈ విఫయం కాస్తా అన్యమత ప్రచారం అనే రూపాన్ని దాల్చింది. భారతీయ జనతాపార్టీ దీనిపై విస్తృత ప్రచారానికి దిగింది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఆయా వివాదాలన్నింటితో కూడిన ఫొటోలను గుదిగచ్చి.. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికితోడు- తన అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు డల్లాస్ లోని హచిసన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేయడాన్ని నిరాకరించారనే వివాదం ఒకటి చుట్టుముట్టింది.
వినాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు
తాజాగా- వినాయకుడి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పులిమిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకున్నదో తెలియట్లేదు గానీ.. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్సీపీకి కల్పించింది. వచ్చేనెల 2వ తేదీన వినాయక చవితి. ఈ పండగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. గణేషుడి మంటపాలు ఏర్పాటవుతాయి. తొమ్మిది లేదా 11 రోజుల పాటు వినాయకుడి విగ్రహాలను పూజించిన తరువాత.. వాటిని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికోసం ఏపీ, తెలంగాణల్లో పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఓ గణేషుడి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను పులమడం సరికొత్త వివాదానికి తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీనిపై వైఎస్ఆర్ సీపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.