చంద్రబాబు రోజుకో డ్రామా, అప్పుడు హేళన చేసి..: వైసీపీ నేతలు ఫైర్
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. గతంలో తమ పార్టీ అవిశ్వాసం పెడితే అవహేళన చేసిన చంద్రబాబు.. ఆ రోజే తమకు మద్దతుగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు.
టీడీపీ-బీజేపీ వ్యవహారం, పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుబ్బారెడ్డి నివాసంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని, అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు.
ఇదంతా టీడీపీ-బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమని ఆరోపించారు. కాగా, బుధవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైసీపీ నేతలు నిరసనలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.