పెన్షన్లపై వైసీపీ ప్లాన్ అదే-బయటపెట్టిన సజ్జల-వీళ్లకు తీస్తేనే కొత్తవారికి-అర్హత రాగానే మళ్లీ
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా పింఛన్లను లబ్దిదారులకు అందించడం మొదలుపెట్టింది. అర్హతలు ఉన్నా లేకపోయినా, నేతలు, వాలంటీర్ల సిఫార్సులతో పించన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు అవే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిపోతున్న పరిస్ధితి. దీంతో ఇప్పుడు క్రమంగా వాటిని తొలగించడం మొదలుపెట్టారు. ఇది సహజంగానే లబ్దిదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కానీ వైసీపీ అసలు ప్లాన్ మాత్రం వేరేగా ఉన్నట్లు కనిపిస్తోంది.
వైఎస్సార్ ఆసరా పింఛన్లు
ఏపీలో వైసీపీ అదికారంలోకి వచ్చాక అప్పటివరకూ అమలైన పింఛన్ల పథకానికి పేరు మార్చి వైఎస్సార్ ఆసరా పేరుతో అమలు చేస్తున్నారు. అంతే కాదు వైసీపీ హామీ ఇచ్చిన విధంగా మొదటి ఏడాది మాత్రం రూ.250 పెంచారు. దీంతో పింఛన్ మొత్తం రూ.2250కు చేరింది. ఆ తర్వాత రెండేళ్లుగా పింఛన్ల మొత్తం పెంపు మాటెత్తడం లేదు. అదే సమయంలో పింఛన్ల తొలగింపుకు ప్రభుత్వం వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. క్షేత్రస్ధాయిలో ఈ మేరకు ముమ్మరంగా సర్వే లు సాగిపోతున్నాయి. అనర్హుల పేరుతో నోటీసులు వెళ్లిపోతున్నాయి. ఇవన్నీ సహజంగానే ప్రస్తుత లబ్దిదారుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.
తొలగింపును సమర్ధించుకున్న జగన్
తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ పింఛన్ల తొలగింపును సమర్ధించారు. మంత్రులకూ ప్రజల వద్దకు వెళ్లి దీనిపై క్లారిటీ ఇవ్వాలని సూచించారు. అనర్హులకు పింఛన్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. పింఛన్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలంటే దీనిపై హోంవర్క్ చేసి ప్రజల్లోకి గణాంకాలను తీసుకెళ్లాలని మంత్రులకు జగన్ సూచించారు. దీంతో ఇప్పుడు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు అదే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పింఛన్ల తొలగింపుపై క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ నిర్ణయాల్లో కీలకంగా ఉన్న సజ్జల పింఛన్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
పింఛన్ల తొలగింపు అంగీకరించిన సజ్జల
ఇప్పటివరకూ రాష్ట్రంలో పింఛన్ల తొలగింపును ఖండిస్తూ వస్తున్న ప్రభుత్వం తొలిసారి తొలగింపును మాత్రం బహిరంగంగా అంగీకరించింది. అనర్హులకు మాత్రమే పించన్లు తొలగిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వైసీపీ కార్యాలయంలో జరిగిన శెట్టిబలిజ సామాజిక వర్గ నేతల సమావేశంలో వెల్లడించారు. అయితే 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ లక్షన్నర మందికి తొలగిస్తే గగ్గోలు పెడుతున్నారంటూ విపక్షాలు, మీడియాపై సజ్జల నిప్పులు చెరిగారు. అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్న సర్వేలు, విచారణలు, నోటీసుల జారీ చూస్తుంటే అసలు లబ్దిదారులకు సైతం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అనర్హతతో తీసేసినా.. అర్హత రాగానే మళ్లీ
ప్రస్తుతం రాష్ట్రంలో తొలగిస్తున్న పింఛన్లపై సజ్జల రామకృష్ణారెడ్డి మరో క్లారిటీ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం అనర్హతల కారణంగా పింఛన్లు తొలగిస్తున్నా.. అర్హత రాగానే మళ్లీ వాళ్లను పింఛన్ల జాబితా చేరుస్తామన్నారు. అంటే ప్రస్తుతం అనర్హులుగా మారుతున్న వారు భవిష్యత్తులో అర్హులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు. భవిష్యత్తులో అర్హులుగా మారగానే వింఛన్ పొందే వెసులుబాటు వీరికి ఉందన్నారు. అయితే ఇప్పుడు అనర్హులు అయిన వారు భవిష్యత్తులో ఎలా అర్హులు కావచ్చో మాత్రం సజ్జల చెప్పకుండా దాటవేశారు. దీంతో ఇప్పుడు అనర్హులుగా ప్రకటించడం ఎందుకు, భవిష్యత్తులో అర్హుల్ని చేయడమెందుకన్న వాదన వినిపిస్తోంది.
వీళ్లకు తొలగిస్తేనే మరింత మందికి..
ప్రస్తుతం అనర్హుల పేరుతో పింఛన్లు తొలగిస్తున్న వారిపై సజ్జల మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. వీరికి తొలగిస్తేనే భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి ఇవ్వొచ్చని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు వీరిని తొలగించడం ద్వారా భవిష్యత్తులో మరికొందరికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోందని సజ్జల చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పుడు అనర్హులుగా చేస్తున్న వారెవరు, భవిష్యత్తులో అర్హులు అయ్యే వారెవరన్న దానిపైనా విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక సర్వేలు చేసుకుని, పూర్తి వివరాలు డిజిటలైజ్ చేసిన తర్వాతే వీరికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయినా ఓసారి అర్హులయ్యాక మళ్లీ అనర్హులు ఎలా అవుతారని హైకోర్టు కూడా ఈ మధ్య నిలదీసింది. దీంతో వైసీపీ పింఛన్ల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
Recommended Video
వైసీపీ అసలు ప్లాన్ ఇదేనా ?
పింఛన్ల తొలగింపు, చేరికలకు సంబంధించి వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే జగన్ సర్కార్ అసలు ప్లాన్ ఇట్టే అర్ధమవుతుంది. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారిలో తమకు గిట్టని వారో, విపక్ష పార్టీలకు చెందిన వారో ఉంటే వారిని తొలగించి, భవిష్యత్తులో ఆ మేరకు వైసీపీ కార్యకర్తలు,సానుభూతిపరులు ఎవరైనా పింఛన్లు లేకుండా ఉంటే వారికి మేలు చేయాలన్న తపన కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పింఛన్ల తొలగింపు లెక్కల్ని పక్కనబెట్టి, ఇలా కొత్తగా జాబితాలో చేర్చే వారిని మాత్రమే చూపిస్తూ కొత్తగా ఇన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పుకోవడం ద్వారా రాజకీయంగా కూడా మైలేజ్ తెచ్చుకోవాలన్న ఆతృత వైసీపీ సర్కార్ లో కనిపిస్తోందని విపక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమైనా ఓసారి అర్హులుగా నిర్ణయించిన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అర్హతల పేరుతో తమను వేధించడం మాత్రం సరికాదని లబ్దిదారులు చెప్తున్నారు. ఈసారైనా తమ అర్హతలు నిలబడతాయా లేదా అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.