సెమీస్ లో జగన్, చంద్రబాబు!! ఫైనల్ లో?
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం హోరాహోరీగా తలపడటం సహజంగా జరిగే పరిణామం. కానీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నాయి. దీనికి కారణం వైసీపీ 'గడప గడపకు మన ప్రభుత్వం' .. తెలుగుదేశం 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాము చేసిన పనులను ఇంటింటికి తిరిగి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రజాప్రతినిధులందరినీ ఇందులో భాగస్వాములనుచేశారు. దీనిలో పాలుపంచుకోని వారికి తర్వాత ఎన్నికల్లో సీటిచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చేశారు. దీంతో వార్డు సభ్యుల నుంచి మంత్రుల వరకు అందరూ ఇంటింటికీ తిరుగుతున్నారు.
వైసీపీ వైఫల్యాలను తెలపడానికే 'ఇదేం ఖర్మ'
తెలుగుదేశం పార్టీ వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి 'ఇదేం ఖర్మ' కార్యక్రమాన్నిరూపొందింది. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ సలహా మేరకు దీనికి డిజైన్ చేశారు. ప్రజలపై ఎంత భారం మోపారు? ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు.. తదితర విషయాలను ప్రజలకు వివరించడానికి తెలుగుదేశం కొత్తగా 'ఇదేం ఖర్మ'ను రూపొందించారు. దీనికి ముందు 'బాదుడే బాదుడు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది.
అధికారమే.. అంతిమ లక్ష్యం!
ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి రావడమే ఈ రెండు పార్టీల లక్ష్యం. అంటే ప్రజలు ఎవరిని ఎక్కువగా నమ్మితే వారినే గెలిపిస్తారు. ఇప్పడున్న పరిస్థితిలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం విజయవంతమవుతోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఇంత లబ్ధి జరిగిందని, పథకాలద్వారా తాము ఇంత డబ్బులిచ్చామని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. పథకాలొక్కటే కాదని రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలు, విద్యుత్తు బిల్లులు, ఇసుక, చెత్త పన్ను, ఇంటి పన్ను ఇలా పన్నుల భారంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రజల్లోకి వెళ్లిన రెండు కార్యక్రమాలు..
'ఇదేం ఖర్మ'లో తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపిన పన్నుల భారాన్ని తెలియజేయడమే కాకుండా వైసీపీ నేతల అక్రమాలపై పోరాడుతున్నామంటూ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. కాకపోతే టీడీపీ నాయకులు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంలేదు. అదొక్కటే ఆ పార్టీకి మైనస్. రెండు పార్టీల కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఒకరకంగా ఈ రెండు పార్టీలు ఈ రెండు కార్యక్రమాల విజయవంతంతో సెమీఫైనల్ కు చేరుకున్నాయని, విజయం వరించి చివరకు ఫైనల్ కు ఎవరు చేరతారో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.