టీడీపీకి మంచి బుద్ధి ప్రసాదించండి: మహాత్ముడికి వైసీపీ వినతిపత్రం
అమరావతి: రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏపీ ప్రభుత్వానికి మంచి బుద్ది ప్రసాదించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఏపీకి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆటంకాలు కలిగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని అందులో పేర్కొన్నారు.
ప్రత్యేకహోదా కోసం మాట్లాడే వారిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతందన్నారు.
విజయవాడలో వైసీపీ కార్పోరేటర్పై దాడి
వైసీపీ నేతలపై అధికార పార్టీ నేతల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. విజయవాడలో కార్పోరేషన్ కార్యాలయంలో వైసీపీ కార్పోరేటర్ బహుదూర్పై తెలుగుదేశం పార్టీ నేత రత్న రమేష్ దాడి చేశాడు. ఈ దాడిలో బహుదూర్కు స్వల్ప గాయాలయ్యాయి.
జన్మభూమి కమిటీ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే పింఛన్లను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకే వైసీపీ కార్పోరేటర్పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధిత కార్పోరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.