చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు, అడ్డదారిలోనే గెలుపు: అంబటి
అమరావతి: అడ్డదారిలో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించిన ఏపీ సీఎం చంద్రబాబుకు అహంకారం బాగా పెరిగిపోయిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు అన్నారు.
పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ కారణంగా టిడిపి ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. శాశ్వతంగా అధికారంలో తానే ఉంటాననే భ్రమంలో చంద్రబాబునాయుడు మునిగిపోయారని ఆయన విమర్శించారు.
నియంతలైన హిట్లర్, సద్దాం హుస్సేన్ల మాదిరిగానే చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్షం ఉండకూడదనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
గుంటూరులో శుక్రవారం నాడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోల్, పొలిటికల్ మేనేజ్మెంట్ వల్లే నంద్యాల, కాకినాడలో టిడిపి విజయం సాధించిందన్నారు అంబటి రాంబాబు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
2012 ఉపఎన్నికల్లో టిడిపికి కనీసం డిపాజిట్లు కూడ దక్కలేదని ఆయన ప్రస్తావించారు. 3 ఏళ్ళ తన పాలనపై బాబుకు నమ్మకం ఉంటే ఎన్నికలకు ముందే నంద్యాలకు ఎందుకు అన్ని కోట్ల నిధులు ఇచ్చారని అంబటి ప్రశ్నించారు. మొక్కవోని ధైర్యంతోనే తాము పోరాటం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మొక్కవోని ధైర్యంతో తాము పోరాటం చేసి టిడిపిని ఓడించనున్నట్టు చెప్పారు అంబటి రాంబాబు.