కౌంటింగ్ ఏజెంట్ల కోసం వైఎస్ఆర్సీపీ నాయకత్వం..కీలక సందేశం!
అమరావతి: ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అతి తక్కువ మెజారిటీతో ఓడిపోతున్న సమయంలో గందరగోళానికి తెర లేపి, కౌంటింగ్ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపి వేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నియమించబోయే ఏజెంట్లను ఆ పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గతంలో ఎప్పుడూ లేని విధంగా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడటానికి అవకాశం ఉందని నిర్ణయానికి వచ్చిన వైఎస్ఆర్ సీపీ నాయకత్వం.. దీనికి అనుగుణంగా పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా- పార్టీ ఏజెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. దీనికోసం ఈ నెల 16వ తేదీన ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించనుంది.
విజయవాడ బందరు రోడ్డులోని డీవీ మేనర్ హోటల్ సమీపంలో ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉదయం 10 నుంచి సాయత్రం 4 గంటల వరకూ ఈ శిబిరాలు కొనసాగుతాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాల ద్వారా ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వంటి అంశాలపై ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడటానికి అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుని ఈ శిక్షణా శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మోసపోయే పరిస్థితి రావచ్చని, గెలుపోటములు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డమ్మీ ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా నిపుణులతో వాటి లెక్కింపుపై శిక్షణ ఇస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఓ సర్క్యులర్ను జారీ చేశారు.