టీడీపీకి పోటీగా అప్పులు చేస్తున్న వైసీపీ సర్కార్..ఆర్ధిక సంక్షోభంలో ఏపీ
అసలే లోటు బడ్జెట్ రాష్ట్రం. అందునా విభజన తర్వాత పుట్టెడు బాధల్లో ఉన్న రాష్ట్రం . రాజధాని కూడా లేకుండా నేటికీ ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ . గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఏపీని అభివృద్ధి చెయ్యటం కోసం చాలానే ప్రయత్నాలు చేసింది. అందుకోసం పుట్టెడు అప్పులు కూడా చేసింది. రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చెయ్యాలని చాలా నిధులు ఖర్చు పెట్టింది. అయినా నేటికీ రాజధాని అంశం ఏపీకి ఒక ప్రహసనంగానే మారింది . ఇక నేడు టీడీపీ చేసిన అప్పుల రికార్డును బద్దలు కొట్టేలా వైసీపీ సర్కార్ కూడా అప్పులను చేస్తుండటం ఏపీ ఆర్ధిక పరిస్థితిని మరింత అగాధంలోకి నెడుతుంది .
చంద్రబాబు చేసిన పనే చేస్తున్న జగన్
అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టిస్తోంది. ఒకర్ని మించి ఒకరు అన్నట్టుగా అడ్డగోలుగా అప్పులకు తెగబడ్డారు . గతంలో చంద్రబాబు చేసిన పనే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా చేస్తున్నారు. ఒక్క ఆర్థిక సంవత్సరం అదీ కూడా పది నెలల కాలంలోనే ఏకంగా రూ. 47,100 కోట్లు వైసీపీ సర్కార్ అప్పు చేసినట్టు తెలుస్తుంది . మరో రెండు నెలల కాలంలో మరో రూ. పది వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు . ఎలా చూసినా.. ఒక్క ఏడాదిలో అప్పు యాభై వేల కోట్లకుపైగానే ఉండనుంది. ఈ లెక్కన వైసీపీ ఐదేళ్ళ కాలంలో ఎంత అప్పు చేస్తుందో అన్నది ప్రశ్న.
టీడీపీ హయాంలోని అప్పుల రికార్డును అధిగమించే పనిలో వైసీపీ సర్కార్
ఇక తెలుగుదేశం పార్టీ తమ హయాంలో రూ. లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేశామని చెప్తుంది . కానీ వైసీపీ ప్రభుత్వం విభజన నాటికి రూ. 90 వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పు అప్పు టీడీపీ హయాంలో రూ. 3.62 లక్షల కోట్లకు చేరిందని చెప్పిన పరిస్థితి . ఇక తాజాగా ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు హర్షణీయమే అయినప్పటికీ ఆర్ధిక భారంతో కూడుకున్నవి కావటంతో రాష్ట్రం మరింత ఆర్ధిక కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఇక ఇది ఇలా కొనసాగితే టీడీపీ అప్పుల రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
పరిమితికి మించి రుణాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్
ఇక ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో అధికారికంగా 25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశముంది. కానీ పరిమితికి మించి రుణాలు తీసుకుంటుంది ఏపీ సర్కార్ . ఎక్కడ అప్పు దొరికినా తీసుకుంటున్న వైనం ఇప్పుడు ఆర్ధిక స్థితిని మరింత దిగజారుస్తుంది. ఒకపక్క దేశ ఆర్ధిక మందగమన ప్రభావమే కాకుండా రాష్ట్రంలో రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు కూడా రాష్ట్రానికి ఆర్ధిక భారాన్ని మరింత పెంచనున్నాయి. ఇక కేంద్ర సహాయం అంతంత మాత్రంగానే ఉంది.
ఆర్ధిక తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఇప్పటివరకు జీఎస్డీపీలో ఏపీ 31.6 శాతాన్ని అప్పులుగా ఏపీ సర్కార్ తీసుకురావటం ఆంధ్రప్రదేశ్ రుణ సామర్ధ్యం బాగా తగ్గిపోతుంది అని చెప్పటానికి నిదర్శనంగా నిలుస్తుంది .దీని వల్ల భవిష్యత్లో కొత్త అప్పులు తెచ్చుకోవాలంటే చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక తిరోగమనంలో పయనిస్తుంది . ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోవటం ఇందుకు కారణంగా తెలుస్తుంది.
ఆర్ధిక సంస్కరణల దిశగా అడుగులు వెయ్యకుంటే కష్టం అంటున్న నిపుణులు
ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో తలకు మించిన భారం పెట్టుకోవటంతో అది మరింత దారుణంగా మారింది . ఫలితంగా ఈ ఏడాది జీఎస్డీపీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ ఎత్తుగడలతో కాకుండా, గత ప్రభుత్వం అప్పు చేసిన దానికి పోటీగా అప్పులు అన్నట్టు కాకుండా రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితిని బట్టి ఆర్ధిక సంస్కరణల దిశగా అడుగులు వెయ్యకుంటే ఏపీ దేశంలోనే అత్యంత దయనీయమైన పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉంటుంది.