మున్సిపోల్స్ కంటే ముందే పరిషత్ పోరు- మంత్రులకు చెప్పేసిన జగన్-అసలు రీజన్ ఇదే
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. నిన్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ ఇదే విషయం స్పష్టం చేశారు. ముందుగా పరిషత్ పోరు నిర్వహించాలని ఎస్ఈసీని కోరదామని మంత్రులతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలపై సస్పెన్స్
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలను తిరిగి మార్చి 2 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించించి. అయితే మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచే మొదలు పెట్టాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైకోర్టులో ఇప్పటికే పలువురు అభ్యర్ధులు పిటిషన్లు వేశారు.
దీనిపై ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం పరిగణనలోకి తీసుకున్న ఓటర్ల జాబితాపైనా పలు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు నెలకొన్నాయి. దీంతో మార్చి 2 నుంచి మున్సిపల్ ఎన్నికలు తిరిగి ప్రారంభం కావడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ముందు పరిషత్ పోరుకే మొగ్గుచూపుతున్న జగన్
మున్సిపల్ ఎన్నికల విషయంలో నెలకొన్న అభ్యంతరాలు, రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వ్యాక్సినేషన్ నానాటికీ ఆలస్యమవుతున్నపరిస్ధితుల్లో ముందుగా పరిషత్ పోరును ముగించేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్ నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులకు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల కంటే ముందుగా పరిషత్ పోరుకే వెళ్దామని సంకేతాలు ఇచ్చారు. దీంతో మంత్రులు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే మున్సిపల్ పోరు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న వేళ సీఎం జగన్ ఇచ్చిన సంకేతాలతో మంత్రులు కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్ధితి.
నిమ్మగడ్డకు జగన్ సర్కార్ ప్రతిపాదన ఇదే
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కంటే ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే, కోర్టు కేసులు, ఇతరత్రా సమస్యలను బట్టి మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత నిర్వహించవచ్చని ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేయాలని ఎస్ఈసీని కోరదామని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. దీంతో వారు కూడా సరేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించకపోతే కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఎస్ఈసీకి చెప్పనుంది.
మున్సిపోల్స్లో వైసీపీ ఎదురీతే అసలు కారణమా?
కరోనా వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందన్న కారణంతో ముందు పరిషత్ ఎన్నికలు నిర్వహించేసి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కారు ప్రతిపాదించనుండటం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది.
కానీ పట్టణ ప్రాంతాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అదే హవా కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి కార్పోరేషన్లలో రాజధాని తరలింపు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలు కొంప ముంచేలా ఉన్నాయి. దీంతో మున్సిపల్ పోల్స్ను వాయిదా వేయించాలని వైసీపీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ పోరులోనే తమకు అనుకూలమైన పరిస్ధితి ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో పంచాయతీ తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకుంటే వాటి ప్రభావం మున్సిపల్ పోల్స్లో తమకు లాభిస్తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది.