అసలేమైంది: జగన్ ఆరా, వంగవీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్యల వెనుక మరో కోణం
వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి విమర్శలు చేయడం బెజవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు అలా మాట్లాడారని వైసిపిలో చర్చ సాగుతోంది.
విజయవాడ: వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి విమర్శలు చేయడం బెజవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు అలా మాట్లాడారని వైసిపిలో చర్చ సాగుతోంది.
బెజవాడ వైసిపిలో రచ్చ, ఇదీ కారణం: రంగంలోకి జగన్, గౌతమ్ రెడ్డి సస్పెన్షన్
వైసిపి అధినేత జగన్ కూడా ఈ విషయమై ఆరా తీశారని తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి హఠాత్తుగా ఇప్పుడు ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, పార్టీని విమర్శించడం వెనుక కారణాలు ఏమిటని జగన్ అడిగినట్లుగా సమాచారం.
రాజకీయ ఆందోళన
అయితే, గౌతమ్ రెడ్డి అలా మాట్లాడటానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. గౌతమ్ రెడ్డి 2014లో విజయవాడ సెంట్రల్ నుంచి టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ చేతిలో ఓడిపోయారు. ఇటీవల మల్లాది విష్ణు వైసిపిలో చేరారు. దీంతో ఈ టిక్కెట్ విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగా గౌతమ్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
మరో కారణమూ..
ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఫలితాలు వైసిపికి చేదును మిగిల్చాయి. ఈ రెండు చోట్ల వైసిపి ఘోరంగా చతికిలపడింది. 2019 ఎన్నికలకు ముందు వైసిపికి ఇలాంటి దెబ్బ తగలడం కూడా గౌతమ్ రెడ్డిని ఆలోచింప చేసిందని అంటున్నారు.
వైసిపి భవిష్యత్తుపై అనుమానాలు కలిగాయా?
అధికార పార్టీపై చాలా వ్యతిరేకత ఉందని వైసిపి చాలా రోజులుగా చెబుతోంది. కానీ ఈ ఎన్నికల్లో వారి అంచనాలు తారుమారయ్యాయి. అప్పటికే అసంతృప్తితో ఉన్న గౌతమ్ రెడ్డికి వైసిపి భవిష్యత్తు పైన కూడా అనుమానాలు కలిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
గౌతమ్ రెడ్డి ఏం చేస్తారు
పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం, వైసిపికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది. గౌతమ్ రెడ్డి ఇటీవల బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణను కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను వైసిపి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఏం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది.