ఎమ్మెల్యే రోజా ఆడియో లీక్.. వైసీపీ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్.. నగరిలో వర్గపోరు
అధికార పార్టీ వైసీపీలో వర్గపోరాటాలు జిల్లాలవారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వరప్రసాద్ వర్గానికి.. నెల్లూరు వాస్తవ్యుడైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ వర్గానికి మధ్య విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా, వైసీపీకే చెందిన కేజే కుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు ముదిరాయి. ఈక్రమంలో ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల ఆడియో సంచలనం రేపుతోంది.
నన్ను అవమానించారు..
‘‘అర్జంట్ పనిమీద హైదరాబాద్ వెళ్తున్నాను.. మళ్లీ రేపటివరకురాలేను.. మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎంతో కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నగరి అభివృద్ధి కోసం ఎంతదూరమైనా పనిచేస్తాను. కానీ.. పార్టీకి ద్రోహం చేసి.. నాకు వెన్నుపోటు పొడిచి.. నన్ను పదిమందిలో అవమానపర్చిన వ్యక్తుల కార్యక్రమాలకు వెళ్లొద్దు'' అని రోజా ఆడియోలో పేర్కొన్నారు.
వెళితే పార్టీకి దూరమైనట్లే..
కేజే కుమార్ తలపెట్టిన కార్యక్రమానికి ఎవరైనా కార్యకర్తలు వెళితే.. మరుక్షణం నుంచే వాళ్లకు పార్టీతో సంబంధాలు లేనట్లేనని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తన మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని, నగరి నియోజకవర్గాన్ని దెబ్బతీసే విధంగా, ఎమ్మెల్యేని అవమానించేలా పనిచేసేవాళ్లు ఎంతటివారైనాసరే పార్టీకి దూరంగా ఉంచుతామనీ ఆమె సందేశమిచ్చారు.
అసలేం జరిగిందంటే..
పార్టీలోనే రోజా ప్రత్యర్థిఅయిన కేజే కుమార్ షష్టిపూర్తి వేడుకలు చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కుమార్.. అసలా కార్యక్రమానికి వెళ్లొద్దంటూ రోజా.. పార్టీ కార్యకర్తలకు ఆడియో మెసేజ్ లు పంపారు. ప్రస్తుతం నగరితోపాటు చిత్తురు జిల్లా అంతటా ఈ ఆడియోలు సంచలనంగా మారాయి.