నానికి షాక్: మున్సిఫల్ ఫ్లోర్ లీడర్ రవికాంత్ టిడిపిలో చేరిక, గుడివాడలో టిడిపి ప్లాన్ ఇదే
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. గుడివాడలో ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టింది. వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న రవికాంత్ బుదవారం నాడు టిడిపిలో చేరారు.
Recommended Video
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు గత ఎన్నికల్లో సక్సెస్ కాలేదు. అయితే 2019 ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని టిడిపి సర్వశక్తులు ఒడ్డుతోంది.
అయితే తనను ఎవరూ ఒడించలేరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవలనే ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు ప్రముఖులు ఏ రకంగా విజయం సాధిస్తున్నారో తాను కూడ అదే రకంగా గుడివాడ నుండి విజయం సాధిస్తానని కొడాలి నాని ప్రకటించారు.
కొడాలి నానికి చెక్ పెట్టేలా టిడిపి ప్లాన్
కొడాలి నానికి చెక్ పెట్టేందుకు గాను టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీని మట్టికరిపించేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. కొడాలి నానికి మద్దతుదారులుగా ఉన్న వారిని తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రవికాంత్ టిడిపిలో చేరారు. 2019లో కొడాలి నానిని ఈ నియోజకవర్గంలో ఓడించేందుకు టిడిపి వ్యూహలను రచిస్తోంది.
2014 ఎన్నికల్లో ఫలించని టిడిపి ప్లాన్
2014 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానంలో టిడిపి విజయం సాధించేలా ప్లాన్ చేసింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రావి వెంకటేశ్వర్రావును మరోసారి రాజకీయాల్లోకి క్రియాశీలకంగా టిడిపి ఒప్పించింది. రావి వెంకటేశ్వర్రావును టిడిపి గుడివాడ ఇంచార్జీగా నియమించింది.ఈ వ్యవహరంలో బాలకృష్ణ క్రియాశీలకంగా వ్యవహరించారని అప్పట్లో ప్రచారం సాగింది. ఆనాటి నుండి గుడివాడ ఇంచార్జీగా రావి వెంకటేశ్వర్రావు కొనసాగుతున్నారు.2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వర్ రావు కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు..
కొరకరాని కొయ్యగా మారిన నాని
టిడిపి నేతలకు కొరకరాని కొయ్యగా కొడాలి నాని మారాడు. 2009 ఎన్నికల్లో కొడాలి నాని టిడిపి టిక్కెట్టుపై విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో నాని వైసీపీలో చేరారు. వైసీపీలో ఉంటూ టిడిపిపై ఒంటిపై విమర్శలు గుప్పించే నేతల్లో కొడాలి నాని ఒకరు. అయితే టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు హరికృష్ణను నాని గురువుగా భావిస్తారు. 2014 ఎన్నికల తర్వాత కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావుతో పాటు హరికృష్ణ కూడ పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. అయితే హరికృష్ణ కోసమే తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా నాని వివరించారు.
కొడాలి నాని అనుచరులపై టిడిపి టార్గెట్
కొడాలి నాని అనుచరులను లక్ష్యంగా చేసుకొని టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందనే ప్రచారం సాగుతోంది. కొడాలి నానికి ఏ ప్రాంతంలో బాగా పట్టుంది, ఏ ప్రాంతంలో టిడిపి బలహీనంగా ఉందనే విషయాలను ఆసరాగా చేసుకొని టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. అంతేకాదు కొడాలి నానికి బలమైన అనుచరులను తమ వైపుకు లాక్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహలపై టిడిపి కేంద్రీకరించినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.