వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు.
కర్నూలు జిల్లా పీ రుద్రవరంలో మాధవ స్వామి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాధవస్వామి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. గోరంట్ల మాధవ్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తండ్రి మరణించిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన స్వస్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కదిరి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం అసెంబ్లీ స్థానాల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు డాక్టర్ సిద్ధా రెడ్డి, శంకర నారాయణ, ఇక్బాల్, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తదితరులు మాధవ్ కు ఫోన్ చేశారు. తమ సానుభూతిని వ్యక్తం చేశారు.