సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?
అమరావతి: 2014లో అతివిశ్వాసంతో ఓడిపోయామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు.
ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్లది ఒక్కటే లెక్క!
ఇప్పటికే 2014లో టీడీపీ గెలవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణమని, ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నందున అప్పుడు వారికి పడిన ఓట్లు చీలి తమను విజయం వరిస్తుందని భావిస్తున్నారు. దాంతో పాటు సెంటిమెంట్ చూసినా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు
ఇటీవల పలు జాతీయ సర్వేలు తమ ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. వచ్చే లోకసభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలుస్తుందని కొన్ని, 13 సీట్లు గెలుస్తుందని కొన్ని చెప్పాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం నాలుగు స్థానాల్లో గెలుస్తుందని, దాదాపు పది స్థానాల్లో గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెప్పాయి. ఈ లెక్కన ప్రీపోల్ సర్వేలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి.
సెంటిమెంట్ గుర్తు చేసుకుంటున్న కేడర్
ఈ నేపథ్యంలో వైసీపీ కేడర్ మరో సెంటిమెంట్ను కూడా గుర్తు చేసుకుంటుంది. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు. 2003లో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారని, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు.
వైయస్ తర్వాత, చంద్రబాబు గెలుపు
ఆ తర్వాత 2009లో కూడా కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు, 2012లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేశారని, దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోను ఆయన అద్భుత విజయం సాధించారని చెబుతున్నారు. ఇప్పుడు తమ పార్టీ అధినేత జగన్ కూడా పాదయాత్ర చేశారని, కాబట్టి ఈ సెంటిమెంట్ ప్రకారం తమదే గెలుపు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఒంటరి పోరు.. 'పొత్తు' ట్విస్ట్
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందని వైసీపీ చెబుతోంది. అదే సమయంలో పాదయాత్ర చేసినప్పటికీ 2004లో కాంగ్రెస్ పార్టీ తెరాస, లెఫ్ట్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకుందని, 2014లో చంద్రబాబు టీడీపీ, బీజేపీలతో పొత్తు కుదుర్చుకున్నారని, కానీ జగన్ మాత్రం ఒంటరిగా వెళ్తామని చెబుతున్నారని అంటున్నారు. ఇక, పాదయాత్రలు చేసిన వారిలో జగన్ సోదరి షర్మిల కూడా ఉన్నారు. కానీ ఆమె జగన్ కోసం నడిచారు.