నుజ్జనుజ్జయిన వైసీపీ నేత కారు: గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో.. తప్పిన పెనుముప్పు!
హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై వస్తున్న మరో కారును ఢీకొట్టింది.ఈ ఘటనలో సుధీర్ రెడ్డి కారు ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది.
కడప: జమ్మలమడుగు వైసీపీ ఇన్చార్జి సుధీర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఎర్రగుంట్ల సమీపంలోని దొరపల్లి వంతెన వద్ద కారు పంక్చర్ అవడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. హైవేపై ఉన్న డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపై వస్తున్న మరో కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుధీర్ రెడ్డి కారు ముందు భాగం నుజ్జనుజ్జయిపోయింది. సుధీర్ రెడ్డితో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో.. జమ్మలమడుగు నుంచి గుత్తి మీదుగా సుధీర్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే.. సుధీర్ రెడ్డి సహా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాద బాధితుల్లో ఒకరైన సురేంద్రనాథ్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ జయశేఖర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సుధీర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైందన్న వార్త వినగానే వైసీపీ కార్యకర్తలు,నేతలు పెద్ద ఎత్తున కర్నూలు తరలివెళ్లారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెను ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.