'ఇన్సైడ్ టాక్': గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పుపై వైసీపీలో చర్చ?, అదే నిజమైందంటున్న టీడీపీ..
పాడేరు: వైసీపీలో ఎదురైన ప్రతికూలతల వల్లే తాను టీడీపీలో చేరాల్సి వచ్చిందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి గట్టి ప్రయత్నాలు జరగలేదో.. లేక తనకు ఎదురైన అవమానాల వల్లే గట్టిగా నిర్ణయించుకున్నారో తెలియదు గానీ మొత్తానికి ఆమె పార్టీ మారిపోయారు.
Recommended Video
పార్టీ మార్పు తర్వాత వైసీపీలో ఆమె గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల ఫెయిల్యూర్ వల్లే ఆమె పార్టీ మారారనే అభిప్రాయాలు పరోక్షంగా వినిపిస్తున్నాయని సమాచారం. ఏజెన్సీ ఏరియాలో పార్టీ తరుపున ఫైర్ బ్రాండ్ లా పనిచేసిన ఈశ్వరి పార్టీని వీడటం పెద్ద డ్యామేజ్ అని వారు భావిస్తున్నారట.
కమిట్మెంట్ ఉన్న నేత:
కమిట్మెంట్ ఉన్న నేతగా గిడ్డి ఈశ్వరికి వైసీపీలో మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అదీగాక, అరకు ఇన్ చార్జీ విషయంలో పార్టీ తన నిర్ణయాన్ని పట్టించుకోకపోవడం ఆమెకు బాధకలిగించింది. ఒకరకంగా ఇవన్నీ తనను పక్కనపెట్టేందుకు జరుగుతున్న పరిణామాలుగా ఆమె అంచనా వేసింది. ఆ పరిణామాలను తట్టుకోలేకనే పార్టీ మారినట్లు ఈశ్వరి స్వయంగా తెలిపారు.
సరిగా డీల్ చేయలేదు:
అటు జగన్ గానీ ఇటు విజయసాయి రెడ్డి లేదా ఇతర నేతలెవరూ ఆమెకు సరైన భరోసా కల్పించనందువల్లే ఈశ్వరి పార్టీ మారినట్లు వైసీపీలో ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈశ్వరి లాంటి బలమైన నేత పార్టీని వీడుతుంటే.. ఆమెను ఆపడానికి వైసీపీ నుంచి బలమైన ప్రయత్నం జరగకపోవడం వారిని ఆశ్చర్యపరుస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా డీల్ చేసి ఉంటే ఈశ్వరి పార్టీని వీడేవారు కాదని వారిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
జగన్తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!
ఏజెన్సీలో వైసీపీకి దెబ్బే:
2014ఎన్నికల్లో ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీ సత్తా చాటింది. గిరిజన ఓటు బ్యాంకు దాదాపుగా వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. కానీ అక్కడినుంచి ఎన్నికైన నేతలు మాత్రం క్రమంగా టీడీపీ గూటికి చేరారు. దీంతో గిరిజనుల్లో అంతగా ఓటు బ్యాంకు లేని టీడీపికి ఇది మేలు చేకూర్చే విధంగా మారిందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారట. ఇప్పటికైనా పార్టీ జంపింగ్స్ పై కచ్చితమైన చర్చ జరగాలని, అన్నింటిని విశ్లేషించుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారట.
ఆ ఆడియో టేపులే ముంచాయి: ఈశ్వరి నిలదీతతో విజయసాయికి షాక్.. ఆ ఇద్దరికి బొత్స క్లాస్..
అదే నిజమైంది:
పాడేరు ఏజెన్సీలోని కొండ ప్రాంతాల గ్రామాలకు రహదారి సౌకర్యం, మంచినీరు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని గిడ్డి ఈశ్వరి గతంలో మంత్రి లోకేశ్ను కోరారు. ఈశ్వరి లోకేష్ను కలవడంతో ఆమె పార్టీ మార్పుపై ఊహాగానాలు గుప్పుమన్నాయి. చివరకు అదే నిజమైందని ఇప్పుడు లోకేష్ సహా ఇతర టీడీపీ నేతలు వైసీపీని ఎత్తిపొడుస్తున్నారు.