టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ ట్రాప్..!? ఇద్దరు విశాఖ ఎమ్మెల్యేల గైర్హాజరు: తెలుగు దేశంలో కొత్త టెన్షన్
మూడు రాజధానుల వ్యవహారం..ప్రత్యేక అసెంబ్లీ సమావేశంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎలాగైనా అసెంబ్లీలో మూడు రాజధానులకు ఆమోదం పొందాలని ప్రభుత్వం..శక్తి మేర అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందు కోసం తుది వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన టీడీపీ శాసనసభా పక్షం సమావేశం అయింది. అయితే, ఈ సమావేశా నికి వైసీపీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ..మద్దాలి గిరి కాకుండా మరో అయిదుగురు గైర్హాజరయ్యారు. అందులో ఇద్దరు విశాఖ ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరో ముగ్గురు మాత్రం సమాచారం ఇచ్చి గైర్హా జరయ్యారని చెబుతున్నారు. ఇదే సమయంలో మండలిలో తమకున్న బలంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లును అడ్డుకోవచ్చే ధీమాతో ఉన్న టీడీపీకి షాక్ ఇచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలు స్తోంది. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలతో అధికార పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారంటూ..టీడీపీ నేతల అంతర్గ చర్చల్లో చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
పార్టీ సమావేశానికి అయిదుగురు గైర్హాజరు..
అమరావతి నుండి రాజధాని తరలింపును టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఇదే అంశం పైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఆలోచన అమలు చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీంతో..మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. దీని కోసం ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది..అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి..సభలో అనుసరించాల్సిన వ్యూహాల పైన టీడీపీ శాసనసభా పక్షం చర్చిస్తోంది.
ఈ సమావేశానికి రావాలని పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా శాసన మండలి సభ్యులకు సమాచారం పంపారు. సభకు తప్పని సరిగా హాజరవ్వాంటూ వైసీపీకి దగ్గర అయిన వంశీ..గిరితో సహా అందరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసారు. పార్టీ నిర్ణయానుసారం ఓటింగ్ లో పాల్గొనాలని..లేకుంటే చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. అయితే, టీడీఎల్పీ సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
ఇద్దరు విశాఖ ఎమ్మెల్యేలు రాకపోవటంతో..
ఇక టీడీఎల్పీ సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గరు సమాచారం ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. వారిలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. అయితే, విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్..వాసుపల్లి గణేష్ లు సైతం హాజరు కావటం పైన టీడీపీలో చర్చ సాగుతోంది.
వీరిద్దరు ఇప్పటికే విశాఖకు పరిపాలనా రాజధాని స్వాగతిస్తూ తీర్మానం చేసిన వారిలో ఉన్నారు. గంటా కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నా.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తాజాగా ఈ మధ్య కాలంలో తాను విశాఖకు పరిపాలనా రాజధాని కోరుకుంటున్నానని..అదే సమయంలో టీడీపీ అధినేత ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ సైతం జారీ చేసింది. శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కాని..విశాఖ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ ట్రాప్...!?
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రాజధానుల అంశం పైన తొలుత కేబినెట్ లో బిల్లు ఆమోదించి..ఆ వెంటనే శాసనసభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో రాజధానులకు సంబంధించి ఏ రకంగా బిల్లు ప్రవేశ పెట్టినా..సభలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండటంలో అక్కడ బిల్లు ఆమోదానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. దీంతో..ఇప్పుడు అధికార పక్షం మండలిలో ఏ రకంగా బిల్లు గట్టెక్కించాలనే దాని పైన ఆలోచన చేస్తోంది.
అయితే, మండలిలో టీడీపీకి మద్దతుగా దాదాపు 33 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో కొందరితో అధికార వైసీపీ సంప్రదింపులు జరుపుతోందని..వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో బయటకు వచ్చింది. అయితే, తమ పార్టీ లోని మండలి సభ్యులు ఎవరూ అధికార పార్టీకి సహకరించరని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండలిలో ఏ రకంగా అయినా ప్రభుత్వ బిల్లును అడ్డుకుంటామని చెబుతున్న టీడీపీకి..ఈ సమాచారం కలవరానికి గురి చేస్తోంది. దీంతో..అటు శాసనసభలో..ఇటు మండలిలో ఎంత మంది టీడీపీ సభ్యులు పార్టీకి అండగా నిలుస్తారు..ప్రభుత్వం వైపు ఎంత మంది మొగ్గుతారనేది సభలోనే తేలాల్సి ఉంది.