'లోకేష్ క్రేజ్ వైసిపి జీర్ణించుకోలేకపోతోంది: జగన్ రాజకీయ కమేడియన్.. దాసరి
విజయవాడ: తమ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా ఎదగడం చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు అన్నారు.
నారా లోకేష్ ప్రభుత్వంలో భాగస్వామి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైసిపి అధినేత జగన్కు తెలుగుదేశం పార్టీని, తమ నేత నారా లోకేష్ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
జగన్ రాజకీయ కమేడియన్
వైయస్ జగన్ ఓ రాజకీయ కమెడీయన్ అని టిడిపి నేత దాసరి రాజా మాస్టారు ఎద్దేవా చేశారు. జగన్ తన మీడియా ద్వారా లోకేష్ పైన మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. జగన్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలంతా టిడిపి వెంటే ఉంటారన్నారు.
జగన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే రామానాయుడు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంపై వైసిపి అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. ఆదివారం జిల్లాలోని పాలకొల్లులో జగన్ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా జగన్ పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఆయన అవినీతి, అక్రమాలు ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం అహోరాత్రులు కష్టపడుతున్న సీఎం చంద్రబాబును విమర్శించడం సరికాదన్నారు.